గాడి తప్పుతున్న యువత | Divorce within a short period of marriage | Sakshi
Sakshi News home page

గాడి తప్పుతున్న యువత

Feb 22 2026 5:49 AM | Updated on Feb 22 2026 5:49 AM

Divorce within a short period of marriage

సామాజిక మాధ్యమాల ప్రభావంతో పెడదారి 

పెళ్లైన తక్కువ వ్యవధిలోనే విడాకుల బాట  

పోలీసులనూ ఆశ్రయిస్తున్న పలువురు 

టీటీసీ పూర్తి చేసిన సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. పొరుగు మండలంలోని పశు వైద్యశాలలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న గోరంట్ల మండలానికి చెందిన యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువైపులా కుటుంబ పెద్దలు గత ఏడాది నవంబర్‌లో ఇద్దరికీ పెళ్లి చేశారు. కొద్ది రోజులు కాపురం అన్యోన్యంగా సాగింది.

ఈ లోపు వెలువడిన డీఎస్పీ ఫలితాల్లో ఆమె అర్హత సాధించకపోవడంతో భర్త మాట్లాడడం మానేశాడు. చివరకు కనిపించకుండా పోయాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ధర్మవరం పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు స్పందించపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఎస్సీ వద్ద తన గోడు వెల్లబోసుకుంది.  

... ఈ పరిస్థితి ఆమె ఒక్కరిదే కాదు... ప్రేమ వివాహం చేసుకున్న 70 శాతం మంది వివిధ కారణాలతో పోలీసులనో.. న్యాయస్థానాన్నో ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా కుటుంబ పెద్దలకు మనో వేదన మిగులుతోంది.  

పుట్టపర్తి టౌన్‌:  పాతికేళ్ల క్రితం వరకూ పిల్లలు  తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడిచేవారు. పెళ్లిళ్లు కూడా ఎక్కువ భాగం తల్లిదండ్రుల నిర్ణయం మేరకే జరిగేవి. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య ఏదైనా సమస్య తలెత్తితే ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని సమస్యకు పరిష్కారం చూపేవారు. పిల్లలకు సర్ది చెప్పి వారి మధ్య మనస్పర్థలు తొలగించి ఒక్కటి చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. సెల్‌ఫోన్‌ మాయలో పడి ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సర్దిచెప్పబోయే తల్లిదండ్రులను సైతం ధిక్కరిస్తున్నారు.  

ప్రతి వందలో 30 వివాదాస్పదమే.. 
అగ్ని సాక్షిగా జీవితమంతా కలసి ఉంటామని ఒక్కటవుతున్న జంటలు పెళ్‌లైన ఆరు నెలలు, ఏడాది గడవక ముందే మనస్పర్దలతో రోడ్డున పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించక పోవడం, మొండిగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమించి చివరకు విడాకుల వరకూ వెళుతోంది. ప్రతి వంద జంటల్లో 30 వరకు ఇలాంటి కేసులే ఉంటున్నాయి. 

ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతులే ఇందుకు నిదర్శనం. పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నాలకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సామాజిక మాధ్య మాలకు అలవాటు పడిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కనీసం ఒక గంట పాటు సమయం కూడా కేటాయించకపోవడమే ఇందుకు కారణమని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.  

సత్యసాయి జిల్లాలో రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన జంటలు 32
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతుల సంఖ్య  67
విడాకుల పిటీషన్లలో ప్రేమ వివాహాలు  70%

తల్లిదండ్రులు దృష్టి సారించాలి 
ఆధునిక సాంకేతికతను సరైన మార్గంలో పిల్లలు వినియోగించుకునేలా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఈ క్రమంలోనే పిల్లల ప్రవర్తననూ గమనిస్తూ ఉండాలి. ఏమి చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాలు గమనిస్తూ ఉండాలి.  ఒక్కసారి ప్రేమలో పడితే తర్వాత వారు బయటపడడం కష్టం. 

పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టం కూడా అంగీకరిస్తుంది. ఆ తర్వాత చిన్నపాటి విషయంలోనూ ఏకీభవించకుండా మనస్పర్థలు చోటు చేసుకుని విడిపోయే వరకూ దారి తీస్తుంది. ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయి.      – సతీష్ కుమార్, ఎస్పీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement