నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సోమవారం మొదటి ఏడాది, మంగళవారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. ఈ ఏడాది మొదటి, రెండో ఏడాది పరీక్షలకు 10,57,312 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించినట్లు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా చెప్పారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పరీక్ష కమిటీలు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తాయని తెలిపారు.
విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సు సర్వీసులు నడపాలని ఆరీ్టసీని కోరామని చెప్పారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలుంటే విద్యార్థులు 1800–425–1531(టోల్ ఫ్రీ) నంబర్ను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని సూచించారు.


