కేంద్రం నిధులపై బాబు పెత్తనం | Babu government fails to release funds within the stipulated time | Sakshi
Sakshi News home page

కేంద్రం నిధులపై బాబు పెత్తనం

Feb 22 2026 5:45 AM | Updated on Feb 22 2026 5:45 AM

Babu government fails to release funds within the stipulated time

కేంద్రం కరుణించినా పంచాయతీలకు దక్కని వరం 

స్థానిక సంస్థలకు జనవరి 29న కేంద్రం రూ.410 కోట్లు 

ఫిబ్రవరి 19న మరో రూ. 616 కోట్లు  

విడుదలైన 10 రోజుల్లో ఖాతాల్లో జమకావాల్సిన నిధులు 

నిర్ణీత గడువులో విడుదల చేయని బాబు ప్రభుత్వం  

దారిమళ్లింపు, రాజకీయాలే సర్కార్‌ ప్రాధాన్యతలు 

తొలి విడతలో విడుదలైన రూ.1,026 కోట్లు 

ఈ నిధుల వినియోగంపైనా తీవ్ర ఆంక్షలు 

సాక్షి, అమరావతి: గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు సర్కారు గ్రహణం కొనసాగుతోంది.  పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను అడ్డుకుని దొడ్డిదారిన మళ్లించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదలైన రూ.వందల కోట్ల నిధులను ఆయా స్థానిక సంస్థలు అక్కడ అవసరాలకు ఖర్చు పెట్టనివ్వకుండా బాబు సర్కార్‌ అడ్డుపడుతోంది.  

కేంద్రం మార్చితో ముగియనున్న ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నేరుగా  15వ ఆర్థిక సంఘం రెండవ విడత నిధులు గత నెల 29న రూ.410 కోట్లు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఆ నిధులను కేంద్రం విడుదల చేసిన తర్వాత పది పని దినాలుగా ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే 20 రోజులు పూర్తయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఆయా ఖాతాల్లో జమ చేయలేదు. 

కాగా ఈ నెల 19న  మరో రూ. 616 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇవి కూడా రాష్ట్రప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నిధులు స్థానిక సంస్థలకు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.  తొలి విడతగా అక్టోబర్‌లో  విడుదలైన రూ.1,026 కోట్లను కూడా రెండు నెలల ఆలస్యంగా స్థానిక సంస్థలకు బదలాయించిన బాబు సర్కార్, వాటి వినియోగంపైనా  పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  

బాబు ప్రభుత్వ ఏర్పాటు నుంచి కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన ప్రతిసారీ నిర్ణీత కాలంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచి ఆలస్యంగా విడుదల చేస్తోంది. రాజకీయ కారణాలతోపాటు నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకుని,  వెసులుబాటును చూసుకొని ఆలస్యంగా స్థానిక సంస్థలకు విడుదల చేస్తోంది.  

ప్రస్తుత సర్పంచులకు వ్యయ అవకాశంలేకుండా చేయడానికే: సర్పంచుల సంఘాలు 
ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం  ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుంది. అంటే మరో 40 రోజుల్లో గ్రామ పంచాయతీల్లో అక్కడి ప్రజలెన్నుకున్న స్థానిక ప్రభుత్వ పాలన ముగిసిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రత్యేకాధికారుల పాలన (ఎన్నికలు జరగని పక్షంలో) వస్తుంది. ప్రత్యేకాధికారుల పాలనకే ఎక్కువగా అవకాశం ఉంటుందని, ఆ సమయంలో, గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా అందజేసే ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రాధాన్యత కోసం ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఖర్చు చేసే వీలుంటుందని చర్చ ఉంది. 

ప్రస్తుత సర్పంచుల పదవీకాలంలో ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఆలస్యంగా విడుదల చేసే ఆలోచన చేస్తోందని సర్పంచుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన వారిలో అత్యధికులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరులే కావడంతో ఆఖరిలో సర్పంచులు తాము చేసిన పనులకు బిల్లులు చేసుకునే పరిస్థితి లేకుండా చేయడం ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని సర్పంచుల సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement