అభివృద్ధి మరిచి.. పేరు చెరిపి !
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో నలువైపులా పలు పనులు చేపట్టారు. రహదారులు, పర్యాటకం, విద్యాలయాలు, ఆసుపత్రులు, మంచినీటి పథకాలు, మార్కెట్.. ఇలా ఎన్నో పనులు చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పలు అభివృద్ధి పనులకు మాజీ శాసనసభ్యులు బుగ్గన శేషారెడ్డి పేరును పెట్టారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో పాలకులు ఒక్క అభివృద్ధి ఇటుక కూడా వేయలేదు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు చేపట్టకపోగా గత వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిని దాచే ప్రయత్నం చేస్తూ.. క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక కంబాలపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన బుగ్గన శేషారెడ్డి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పేరు మార్పునకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ ముఖ్యనేత సూచనతో ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రం బోర్డుపై ఉన్న బుగ్గన శేషారెడ్డి పేరును చెరిపేశారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా, పైనుంచి ఆదేశాలంటూ తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. అభివృద్ధిని విస్మరించి ఉన్నవాటికి పేర్లు మార్చడం, ఆ తర్వాత ప్రారంభించడం ఏమిటని స్థాని కులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.


