ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు!
హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం
బాధితులకు భరోసాగా 'వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు
దేశంలోనే తొలిసారి అమలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. అదే.. 'సీ-మిత్ర' (C-Mitra). దీని ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుంది. సాంకేతికత ద్వారా పోలీసులే మీ వద్దకు వచ్చే అద్భుతమైన 'వర్చువల్' పరిష్కారమిది.
సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఒక 'వర్చువల్ హెల్ప్డెస్క్' ఈ సీ-మిత్ర. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియను పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా సైబర్ మోసం జరిగినప్పుడు బాధితులు '1930' నంబర్కు ఫోన్ చేసి గానీ, జాతీయ సైబర్ పోర్టల్ (https://www.cybercrime.gov.in/) లో గానీ ఫిర్యాదు చేస్తారు. అయితే, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ 'సీ-మిత్ర' రాకతో ఇక ఆ అవసరం ఉండదు. సమస్త ఫిర్యాదు ప్రక్రియ ఇంటి నుంచే పూర్తవుతుంది.
చాలామంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి 'సీ-మిత్ర' బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్బాగ్, హైదరాబాద్ - 500029 అనే అడ్రస్ కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి. అంతేకాదు, సైబర్ క్రైం పీఎస్ వద్ద డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీలను అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సీ-మిత్ర సేవలను పొందేందుకు అర్హులు.
సీ-మిత్ర విధానం వల్ల పౌరుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, స్టేషన్ సిబ్బందికి దర్యాప్తుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. 1930కి, జాతీయ సైబర్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్లుగా మారుతున్నాయి. సీ-మిత్ర ద్వారా దీనిని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం లక్ష రూపాయలకు మించిన సైబర్ మోసాలను సైబర్ క్రైమ్ స్టేషన్లోనూ, అంతకంటే తక్కువైతే స్థానిక పోలీస్ స్టేషన్లోనూ నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై 'సీ-మిత్ర' విధానం ద్వారా 3 లక్షల లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్ఐఆర్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయడం జరుగుతుంది. 3 లక్షల పైన ఉన్న ఫిర్యాదులను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
సీ-మిత్ర సేవలను పొందాలంటే బాధితులు 1930కి కాల్ గానీ, లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే సీ-మిత్ర బృందంలోని వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు బాధితులకు కాల్ చేసి, వర్చువల్ పద్ధతిలో ఫిర్యాదు చేసే విధానాన్ని వివరిస్తారు. సిద్ధం చేసిన ఫిర్యాదు డ్రాఫ్ట్ను బాధితులకు పంపిస్తారు. బాధితులు దానిని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్/కొరియర్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్ సంతకం ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను సందేశరూపంలో బాధితులకు పంపిస్తారు.
ఈ వర్చువల్ హెల్ప్డెస్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందిస్తుంది. సీ-మిత్ర అధికారిక ల్యాండ్లైన్ నంబర్: 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నంబర్ల నుంచే వస్తుంది. సి-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సి-మిత్ర సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ గానీ, డబ్బులు గానీ అడగరు. సీ-మిత్ర కేసును దర్యాప్తు చేయదు. పోయిన డబ్బును వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇవ్వదు. చట్టపరమైన సలహాలు కూడా ఇవ్వదు. కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్నే సంప్రదించాలి.


