2024 వరకు సాయుధ పోరాటానికే మొగ్గు
నంబాల మరణంతో రెండుగా చీలిన పార్టీ
ఆపరేషన్ కగార్తో దండకారణ్యంపై పోలీసుల పట్టు
జనజీవన స్రవంతిలో కలిసేందుకు తెలంగాణకు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ డిఫ్యాక్టో చీఫ్గా చెప్పుకుంటున్న దేవ్జీని.. ఆయుధం వదిలి సాధారణ జీవితం గడిపేందుకు ఒప్పించడంలో తెలంగాణ పోలీసులు సాధించిన విజయం ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పాలి. అయితే ఆయుధం వీడటానికి ముందు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. లొంగిపోయిన మావోయిస్టులు, సాయుధ పోరాట సానుభూతిపరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ నిర్బంధంపై 2018 లోనే మావోయిస్టులు ఒక అంచనాకు వచ్చారు. అయితే 2024 జనవరి 1న కేంద్రం ఆపరేషన్ కగార్ను ప్రారంభించడంతో మావోలపై ముప్పేట దాడి మొదలైంది.
2024 ఆగస్టు నాటికి సాయుధ పోరాటం కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపించడం ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో ‘బెంగాల్లో మన పోరాటం మొదలైంది. అక్కడ నిర్బంధం పెరిగితే శ్రీకాకుళం వచ్చాం. మన్యంలో ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఉత్తర తెలంగాణను గెరిల్లా జోన్గా మార్చాం. అక్కడ ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే దండకారణ్యం చేరుకున్నాం. మునుపెన్నడూ లేనంత బలంగా దండకారణ్యంలో పాతుకుపోయాం. నిర్బంధం పేరుతో చివరకు ఈ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయడం సరికాదు.నిర్బంధం పేరుతో ఇంకెంత కాలం అడ్డాలు మారుస్తాం’అంటూ హిడ్మా తదితర నేతలు వెల్లడించిన అభిప్రాయానికి పారీ్టలో మెజార్టీ మద్దతు లభించడంతో ఆయుధం వదిలేందుకు మావోలు సిద్ధపడలేదు.
రెండు వర్గాలుగా..
ఆపరేషన్ కగార్ తీవ్రత అంచనాలకు మించి ఉండడంతో 2025 ఏప్రిల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి శాంతి చర్చల ప్రస్తావన వచ్చింది. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ జార్ఖండ్లో ఎన్కౌంటర్ అయ్యారు. ఆ వెంటనే మే 21న జరిగిన గుండెకోట్ ఎన్కౌంటర్లో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా మృతి చెందారు.
అప్పటి నుంచి ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం కరువైంది. ఆ తర్వాత చోటుచేసుకున్న మరికొన్ని ఎన్కౌంటర్లలో సీసీ మెంబర్లుగా ఉన్న పర్వేశ్, గణేశ్, మోడెం బాలకృష్ణ, సుధాకర్, కడారి సత్యనారాయణరెడ్డి, కాతా రామచంద్రారెడ్డి వంటి కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందనే వాదన వినిపిస్తున్న మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్జీ, హిడ్మా, మిసిర్ బెష్రా సాయుధ పోరాట పంథాను ఎంచుకున్నారు. దీంతో ఆ పార్టీలో స్పష్టమైన చీలిక వచ్చినట్టయింది.
హిడ్మా మరణంతో..
దండకారణ్యం నుంచి అర్బన్ షెల్టర్లకు తరలే క్రమంలో హిడ్మా చనిపోవడం పార్టీపై పెను ప్రభావం చూపించింది. అనంతరం సాయుధ పంథాను ఎంచుకున్న సీసీ సభ్యుడు రాంధేర్తో పాటు అనేక మంది కింది స్థాయి సభ్యుల లొంగుబాటు పరంపర మొదలైంది. మరోవైపు అజ్ఞాతంలోనే ఉన్న పాక హన్మంతు, అనల్దా వంటి సీసీ మెంబర్లు కూడా ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గతేడాది చివరి వారం నాటికే సాయుధ పోరాటం సాధ్యం కాదనే అభిప్రాయానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం వచ్చింది.
తెలంగాణ విధానాలతో..
అడవిని వీడాలనుకునే మావోయిస్టుల విషయంలో ఆయుధాల అప్పగింతపై తెలంగాణ పోలీçసులు షరతులు విధించడం లేదు. అంతేకాదు సరెండర్ సమ యంలో తమతో పాటుగా కుర్చీలు వేసి గౌరవప్రదంగా సాధారణ జీవితంలోకి స్వాగతం పలుకుతున్నారు. అక్కడికక్కడే నేరుగా ప్రెస్తో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో దశాబ్దాల పాటు నాడీ, నరం, కండ, బుద్ధి ఇలా అన్నింటా తిరుగుబాటు స్వభావం, సాయుధ పోరాట పంథాను అలవర్చుకున్న మావోయిస్టులు..ఇతర రాష్ట్రాల వైపు చూడకుండా తెలంగాణకు వస్తున్నారు.
కాల్వపల్లి చివరి వ్యక్తి దామోదరే..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మావోయిస్టు ఉద్యమబాట పట్టారు. ఈ నేపథ్యంలో గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఇక గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసినట్లయ్యింది.
కొడుకును చూడలేను
‘నా కొడుకు అన్నల్లో కలిసి 30 ఏళ్లు అయ్యింది. పోలీసులకు లొంగిపో అని చెప్పిన. నేను చెప్పినట్లే లొంగిపోయినందుకు ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు నాకు కంటిచూపు లేదు. కొడుకు వచ్చినా చూడలేను. చేయి పట్టుకుని మాట్లాడుతా..’అంటూ దామోదర్ తల్లి బతుకమ్మ కన్నీటిపర్యంతం అయ్యింది.


