మావోయిజం ఎప్పటికీ ముగియదు | Devji and Malla Rajireddy with the media after surrender | Sakshi
Sakshi News home page

మావోయిజం ఎప్పటికీ ముగియదు

Feb 25 2026 5:46 AM | Updated on Feb 25 2026 5:46 AM

Devji and Malla Rajireddy with the media after surrender

మాట్లాడుతున్న రాజిరెడ్డి. చిత్రంలో దేవ్‌ జీ

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది 

సాయుధ పోరాటం ముగిసిందని కూడా చెప్పలేం.. 

లొంగుబాటు అనంతరం మీడియాతో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి 

మా సిద్ధాంతాల స్ఫూర్తితో త్వరలో రాజకీయాల్లోకి వస్తాం 

చట్టబద్ధంగా సమస్యలపై పోరు కొనసాగిస్తాం

సాక్షి, హైదరాబాద్‌: మావోయిజం ఎప్పటికీ అంతం కాదని మంగళవారం లొంగిపోయిన మావోయిస్టులు అన్నారు. తాము అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చామని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి చట్టబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాడతామని ప్రకటించారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన అనంతరం తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు మరోసారి సుదీర్ఘంగా సమాధానమిస్తామని చెప్పారు. ఇప్పుడు వెంటనే చేసే వ్యాఖ్యానాలు అనవసరమైన చర్చకు దారితీసే అవకాశం ఉందన్నారు.  

వ్యక్తిగత జీవితం కోసం కాదు: తిరుపతి 
‘నేను అనారోగ్య కారణాలతో అజ్ఞాతం వీడి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు. ప్రజల సమస్యలపై చట్టబద్ధ పద్ధతుల్లో, లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నా. అంటే రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని అర్థం. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా సమస్యలపై పోరాడాలని భావిస్తున్నా. దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతాన్నే మార్గదర్శకంగా తీసుకుని పనిచేస్తా.

ప్రస్తుతం మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. ఏది మాట్లాడినా అపార్థాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అది నా రాజకీయ భవిష్యత్తుకు సమస్య కాకూడదని భావిస్తున్నా. మరోసారి మిమ్మల్ని (మీడియాను) కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తా..’అని తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ చెప్పారు.  

ప్రజా పోరాటాల వెనుక నిలబడతాం: రాజిరెడ్డి 
మల్లా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ‘మావోయిజం ఎప్పుడూ ముగియదు. ప్రపంచ వ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సాయుధ పోరాటం ముగిసిందని చెప్పలేము. ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టపరిధిలో పని చేయాలని ఆలోచిస్తున్నాం. ఇన్నాళ్ల ఉద్యమంలో పొందిన అవగాహనతోనే ముందుకు వెళతాం. అవకాశాల మేరకు ప్రజల పోరాటాల వెనుక నిలబడతాం. కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ప్రభుత్వంతో చర్చిస్తాం...’అని పేర్కొన్నారు.  

సమీప బంధువు ప్రోద్బలంతో.. 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1998 డిసెంబర్‌లో తన సమీప బంధువు బడె నాగేశ్వర్‌రావు అలియాస్‌ ప్రభాకర్‌ ప్రోద్బలంతో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో చేరి అ/ê్ఞతంలోకి వెళ్లారు. దామోదర్‌ ఏటూరునాగారం– మహాదేవపూర్‌ ప్రాంత మహిళా దళం, కొత్తగూడెం –పాల్వంచ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి పొందారు.

2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. 2025 జనవరిలో టీఎస్‌సీ కార్యదర్శిగా పదోన్నతి పొంది అదే హోదాలో లొంగిపోయారు. 2001లో ఏటూరునాగారం దళంలో సభ్యురాలైన ఎట్టి నర్సమ్మ ౖఅలియాస్‌ సబితను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందగా.. 2016 అక్టోబర్‌లో చర్ల కమిటీలో పనిచేస్తున్న మడకం కోసి అలియాస్‌ రజితను వివాహం చేసుకున్నారు. 2022లో తెలంగాణ పోలీసులు ఈమెను అరెస్టు చేయగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 

ఎల్‌ఎల్‌బీ చదువుతూ ఆర్‌ఎస్‌యూలోకి.. 
ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన నూనె నర్సింహారెడ్డి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో రిటైర్డ్‌ లెక్చరర్‌ జంధ్యాల రవీంద్రనాథ్‌ నాయకత్వంలో 1987లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1990లో దుర్గి దళానికి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. 1993లో కమాండర్‌గా, 1995లో ఏపీ సౌత్‌ కోస్టల్‌ బెల్ట్‌ కమిటీలో, 1998 నుంచి 2001 వరకు డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2002లో విజయవాడలో పోలీసులు అరెస్టు చేయగా 2004లో విడుదలయ్యారు. 2005లో ఏఓబీఎస్‌జెడ్‌సీకి బదిలీ అయ్యారు. 2010లో మళ్లీ అరెస్టయి 2014లో విడుదలయ్యారు. 2020లో డీకేఎస్‌జెడ్‌సీ బెటాలియన్‌ పొలిటికల్‌ ఎడ్యుకేషన్‌ అడ్వైజర్‌గా పనిచేశారు. 2025 మే లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు.  

ఇంటర్‌ నుంచే ఉద్యమాల వైపు..
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ అలియాస్‌ కుమ్మ దాదా అలియాస్‌ సంజీవ్‌.. కోరుట్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుతున్న సమయంలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1982లో పీపుల్స్‌వార్‌లో చేరారు. 1987 అక్టోబర్‌ వరకు సిరోంచా ప్రాంత సాయుధ దళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1989 ఏప్రిల్‌ నాటికి డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా, 1993లో ఉత్తర గడ్చిరోలి సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా, 1995లో స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు.

2001లో జరిగిన పార్టీ 9వ మహాసభల్లో సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎం) సభ్యుడిగా నియమితులయ్యారు. 2017లో సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎం) ఇన్‌చార్జిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా (పీబీఎం) ఎన్నికయ్యారు. మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోను లొంగిపోయిన అనంతరం ’అభయ్‌’ పేరుతో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. మావోయిస్టు పారీ్టలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆ మేరకు గుర్తింపు పొందారు. దేవ్‌జీ భార్య అరికె జైనీ అలియాస్‌ సృజన కాసన్సూర్‌ అటవీ ప్రాంతంలో 2020లో మృతి చెందారు.  

ఆర్‌ఎస్‌యూ నుంచి సెంట్రల్‌ కమిటీ వరకు 
    పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లె గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డిది (76) వ్యవసాయ కుటుంబం. తండ్రి వెంకట్‌రెడ్డి, తల్లి రాజమ్మ కాగా ఒక తమ్ముడు ఉన్నాడు. ఈయన ఆర్‌ఎస్‌యూ నుంచి సెంట్రల్‌ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1971లో ఇంటర్‌ పూర్తి చేసి 1974లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1976లో కోరుట్ల, జగిత్యాలలో నమోదైన పలు కేసుల్లో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 1978 నుంచి 1980 వరకు గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలో ఆర్గనైజర్‌గా పని చేశారు.

1982లో పీపుల్స్‌వార్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం ఏరియా డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 1988లో ఆదిలాబాద్‌ సబ్‌ జైలు నుంచి పారిపోయి అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లారు.1990లో సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి మార్గనిర్దేశం చేసే బాధ్యతలు నిర్వహించారు. తర్వాత పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2022లో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఇన్‌చార్జిగా నియమితులై ప్రస్తుతం అదే హోదాలో లొంగిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement