దేవాదుల.. ఎన్నాళ్లిలా? | Devadula Lift irrigation Project still incomplete after 25 years also | Sakshi
Sakshi News home page

దేవాదుల.. ఎన్నాళ్లిలా?

Feb 25 2026 5:26 AM | Updated on Feb 25 2026 5:26 AM

Devadula Lift irrigation Project still incomplete after 25 years also

25 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తికాని ఎత్తిపోతల పథకం

భూసేకరణ సమస్య, నిధుల కొరతతో నిలిచిన చివరి 9 శాతం పనులు 

రూ. 6,016 కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు పెరిగిన అంచనాలు 

తక్షణమే రూ.4,312 కోట్లు అవసరమైనా మంత్రివర్గ భేటీలో దక్కని ఆమోదం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (జేసీఆర్‌డీఎల్‌ఐఎస్‌) నిధుల గండం నుంచి బయటపడటం లేదు. 2001లో శంకుస్థాపన జరిగి 2004 నుంచి పనుల్లో వేగం పెరిగినా 25 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కావడం లేదు. ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్న ప్రకారం ఇప్పటివరకు సుమారు రూ. 14,188 కోట్లు ఖర్చు చేయగా 91 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సుమారు 3 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాక నాలుగేళ్లుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. రూ. 6,016 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు అంచనాలు ఏకంగా రూ. 18,500 కోట్లకు పెరిగాయి. తక్షణమే రూ.4,312 కోట్లు అవసరమవగా ప్రాజెక్టు కోసం సోమవారం ప్రతిపాదించిన నిధులకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించలేదు. 

భూసేకరణే అసలు సమస్య.. 
దేవాదుల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా ఉంది. సీఎం, మంత్రులు ఎన్నిసార్లు సమీక్షలు జరిపినా భూసేరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. మొత్తంగా 33,224 ఎకరాలకుగాను 30,268 ఎకరాలు సేకరించారు. జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్, తపాసుపల్లి, ఆలేరు, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట తదితర ప్రాంతాల్లో 2,956 ఎకరాల వరకు సేకరిస్తేనే పైపులైన్, ఇతరత్రా పనులు సాగనున్నాయి. రోజురోజుకు భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించడం, కోర్టుకు వెళ్లడం లాంటి కారణాల వల్ల ఏళ్లుగా భూసేకరణ జరగడం లేదు. దీనికితోడు నిధుల లేమి కారణంగా నీటిపారుదలశాఖ నిస్సహాయంగా ఉండిపోవడం వల్ల 9 శాతం పెండింగ్‌ పనులు జరగక భారీ ప్రాజెక్టు కాస్తా నేటికీ పెండింగ్‌ జాబితాలో కొనసాగుతోంది. 

అధికార, ప్రతిపక్షాలకు వేదికగా ‘దేవాదుల’... 
గతేడాది యాసంగి నుంచి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన దేవన్నపేట తదితర పంపుహౌస్‌లలో మోటార్లు ఆన్‌ కాకపోవడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ మర్నాడే దేవన్నపేట పంపుహౌస్‌ మోటార్లను అధికారులు ఆన్‌ చేయగా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి తుపాకులగూడెం వద్ద ఇన్‌టేక్‌ వెల్‌ను సందర్శించి సమీక్షించారు. జూన్‌ 2లోగా భూసేకరణకు రూ. 600 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మినీ కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దేవాదుల కోసం నిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement