239 ఎకరాలను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
నాలుగేళ్ల క్రితం కొత్తపేట నుంచి బాటసింగారం తరలిన గడ్డి అన్నారం మార్కెట్
బీఆర్ఎస్ హయాంలో సంఘీనగర్ సమీపంలో మార్కెట్కు స్థలం కేటాయింపు
ఆ స్థలం టీఎస్ఐఐసీకి బదలాయింపు..తాజాగా ఓఆర్ఆర్ పక్కనే మార్కెట్ స్థలం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమీపంలో అంతర్జాతీయ స్థాయి అధునాతన పండ్ల మార్కెట్ రాబోతుంది. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మండలం కోహెడలో ఈ అంతర్జాతీయ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. కోహెడ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 167లో ఔటర్ రింగ్రోడ్డును ఆనుకొని ఉన్న విలువైన 239 ఎకరాల స్థలాన్ని అంతర్జాతీయ స్థాయిలో పండ్లు, పూలు, పాల ఉత్పత్తుల మార్కెట్ కోసం కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి అవసరమైన పండ్లు, పాల ఉత్పత్తులతో పాటు డ్రైఫ్రూట్స్, ఉల్లిగడ్డలను ఈ మార్కెట్ ద్వారానే అందుబాటులోకి తెచ్చే విధంగా అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కోసం ఔటర్ రింగ్రోడ్డు ఆవల సంఘీ టెంపుల్కు వెళ్లే దారిలో కేటాయించిన 170 ఎకరాల స్థలాన్ని టీజీఐఐసీకి అప్పగించి, కొత్త స్థలాన్ని ఎంపిక చేసింది.
మార్కెటింగ్ శాఖ ఈ స్థలంలోని గుట్టలు, చెట్లు తొలగించి అభివృద్ధి చేసేందుకు రూ.9 కోట్ల వరకు వెచి్చంచినట్టు సమాచారం. ఆ మొత్తాన్ని టీజీఐఐసీ నుంచి రికవరీ చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. కొత్తగా కేటాయించిన 239 ఎకరాల భూమి ఔటర్ రింగ్రోడ్డును ఆనుకొని ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి పండ్లు, ఇతర ఉత్పత్తులను తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు, హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాలకు వాహనాల రవాణాకుఉపయుక్తంగా ఉంటుంది.
గడ్డి అన్నారం మార్కెట్కు కొనసాగింపుగా...
హైదరాబాద్లోని కొత్తపేటలో దశాబ్దాల పాటు కొనసాగిన ‘గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్’ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నగరం వెలుపలికి తరలించాలని నిర్ణయించింది. ఈ మార్కెట్ వల్ల నగరానికి ట్రాఫిక్ సమస్యలు అధికం కావడంతో దాన్ని తరలించి, ఆ భూమిని వైద్య సేవల కోసం ‘టిమ్స్’నిర్మాణానికి కేటాయించింది. అప్పటి నుంచి బాటసింగారంలోని 30 ఎకరాల విస్తీర్ణంలోని అద్దె షెడ్లలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కొనసాగుతోంది.
కొత్తపేట నుంచి బాటసింగారంకు తాత్కాలికంగా మార్కెట్ను తరలించినా, అది కేవలం 30 ఎకరాల విస్తీర్ణంలోనే కొనసాగుతుండడంతో స్థలం సరిపోక, వ్యాపారం సాగడం లేదు. దీంతో 330 మంది ఏజెంట్ల స్థానంలో కేవలం 100 మంది మాత్రమే వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి మార్కెట్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నా, కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాపారులకు, చిల్లర వర్తకులకు అందుబాటులో ఉండేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్టు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
500 మందికి పైగా ఏజెంట్లు..
విశాలమైన మార్కెట్లు.. కోల్డ్ స్టోరేజీలు పీపీపీ మోడల్లో ప్రైవేట్ నిర్మాణ సంస్థల సహకారంతో మార్కెట్ను నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నా, ఇతర వ్యాపారాల తరహాలో నిర్మాణ సంస్థలకు లాభాలు వచ్చే పరిస్థితి లేక, నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కమీషన్ ఏజెంట్లకే అక్కడి స్థలాలను 33 ఏళ్ల లీజు పద్ధతిన కేటాయించి అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఇప్పుడున్న 330 మంది కమీషన్ ఏజెంట్లకు తోడుగా మరికొందరిని ఎంపిక చేసి, మార్కెట్ రేటు ప్రకారం 33 ఏళ్లకు స్థలాలను లీజుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇక్కడ విశాలమైన మార్కెట్లు, రోడ్లతోపాటు కోల్డ్ స్టోరేజీలు, వ్యాపారులు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా సీఫుడ్స్, డ్రైఫ్రూట్స్, ఉల్లిగడ్డలు, మామిడితోపాటు అన్ని రకాల సీజనల్ పండ్లకు ప్రధాన మార్కెట్గా కోహెడ మార్కెట్ను తీర్చిదిద్దనున్నట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రెడ్డి తెలిపారు.


