యాసంగి సాగు మధ్య దశలోకి వచ్చినా అందని పెట్టుబడి సాయం
నిరాశ చెందుతున్న రైతులు
మోర్తాడ్(బాల్కొండ): అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తోంది. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు మధ్య దశకు చేరుకున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడకపోవడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో భరోసాపై నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు. అయితే పెట్టుబడిసాయం విడుదలపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈసారి రైతు భరోసా లేనట్లేనా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.
షెడ్యూల్ దాటినా..
గడిచిన వానాకాలం సీజన్లో జిల్లాలోని 2,98,472 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.326.03 కోట్లు జమ చేశారు. యాసంగి సీజన్ కోసం షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున సాయం సొమ్ము జమ చేయాల్సి ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిధుల విడుదల ఆలస్యమైందని రైతులు భావించారు. ఎన్నికల తంతు ముగియడంతో పెట్టుబడి సాయం వస్తుందని నిరీక్షించినా నిరాశే మిగిలిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసాకు నిధులు విడుదల చేస్తే ఊరట లభిస్తుందని అంటున్నారు.


