సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్డీఏ(CRDA) కమిషనర్కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.
మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


