సాక్షి, చిత్తూరు జిల్లా: ఏపీ డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర పిలుపు మేరకు మెగా డీఎస్సీ అక్రమాలపై నగరిలో మూడో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. నగరి రిలే నిరాహారదీక్షకు తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ప్రధాని మోదీ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వెంటనే దృష్టి పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. మెగా డీఎస్సీని దగా చేశారు. మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆనర్హులకు ఉద్యోగం ఇచ్చారు. వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు. బూతులు తిడుతూ, కోడి గుడ్లతో దాడులు చేస్తున్నారు. లంచాలు దండుకుని ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువతకు అండగా నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని తెలిపారు.
అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడుతాం. సీబీఐ విచారణ చేపట్టే వరకూ నిరసనలు ఆగవు అని వ్యాఖ్యానించారు.


