విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలి సొమ్ము రూ.1.54 కోట్లు ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పించి గోడు చెప్పుకొంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు తెలిపిన మేరకు.. పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ కాంట్రాక్టరు.
అతడి వద్ద కట్టుబడిపాలేనికి చెందిన బాణావతు రాజునాయక్ సబ్ కాంట్రాక్టర్గా పలు ప్రాంతాల్లో హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులను నిరి్మంచారు. రాజునాయక్ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పనులు చేయించారు. దీనికి సంబంధించిన కూలి సొమ్ము, ఇతరత్రా రూ.1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు ఇవ్వమని 20 నెలల నుంచి రాజునాయక్, కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర, పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా తరువాత పట్టించుకోవడంలేదు. రూ.12 లక్షలు మాత్రమే ఇస్తామంటూ పామర్తి రాజా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది: సుగాలి మహిళలు
రెండేళ్ల తమ కష్టార్జితం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి మంచి మనస్సు ప్రసాదించాలని సుగాలి మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. 24 గంటల్లో తమకు డబ్బులు చెల్లించకుంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. అదే సమయంలో ఓ సుగాలి మహిళ తీవ్ర ఆందోళనకు లోనై స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది.


