రిలయన్స్కు అగ్రపీఠం
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి గుండా సరఫరా అంతరాయాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశీయంగా అత్యవసర సరఫరా బఫర్ను సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడనుంది.
అన్ని రిఫైనరీలు, అప్స్ట్రీమ్ ప్రాసెసర్ల సంయుక్త ఉత్పాదక సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సర దేశీయ ఉత్పత్తి కంటే రెట్టింపు మాత్రమే కాకుండా, దేశ మొత్తం రోజువారీ ఎల్పీజీ వినియోగంలో (సుమారు 91,000 టన్నులు) దాదాపు 70 శాతానికి సమానం.
రిలయన్స్కు సింహభాగం
గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత రిఫైనరీకి రోజుకు అత్యధికంగా 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలకు కలిపి రోజుకు 31,470 టన్నులు, నయారా ఎనర్జీ వాదినార్ రిఫైనరీకి రోజుకు 4,480 టన్నులు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి అప్స్ట్రీమ్ సంస్థలకు రోజుకు 6,460 టన్నులు ఉత్పత్తి లక్ష్యం ఇచ్చారు. ఈ ఉత్పత్తి షెడ్యూల్ను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో ఏడాదిన రెండుసార్లు సమీక్షిస్తారు.
ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?


