నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదు, అదొక వర్చువల్ వ్యాలెట్గా మారిపోయింది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగలించినా దుండగులు మీ బ్యాంకింగ్ యాప్లను యాక్సెస్ చేస్తే పరిస్థితి ఏమిటి? బాధ్యత ఎవరిది? నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుందా? అనే అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ఆధారంగా ప్రత్యేక విశ్లేషణ చూద్దాం.
సాంకేతిక భద్రత, ముప్పు
సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్లు ఎంపిన్ (MPIN), పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్ భద్రత కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఫోన్తో పాటు సిమ్ కార్డు కూడా నేరగాళ్ల చేతికి చిక్కితే వారు వేరే ఫోన్ ద్వారా ఓటీపీ లేదా యూపీఐ పిన్ రీసెట్ చేసి నిధులను మళ్లించే ప్రమాదం ఉంది.
ఆర్బీఐ మార్గదర్శకాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం.. సిస్టమ్ లోపం లేదా థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఉల్లంఘన వల్ల అనధికార లావాదేవీ జరిగితే అలర్ట్ మెసేజ్ వచ్చిన మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే కస్టమర్పై ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు. ఫిర్యాదు చేయడానికి 4-7 పనిదినాలు ఆలస్యమైతే బ్యాంకు ఖాతా రకాన్ని బట్టి కస్టమర్ రూ.5,000-రూ.25,000 వరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పిన్ లేదా ఓటీపీలను స్వయంగా పంచుకోవడం లేదా ఫిర్యాదు చేయడం 7 పనిదినాలకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకుకు సమాచారం అందించే వరకు జరిగిన మొత్తం నష్టానికి కస్టమర్దే పూర్తి బాధ్యత.
ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలంటే..
వెంటనే టెలికామ్ ఆపరేటర్ను సంప్రదించి సిమ్ సేవలను నిలిపివేయండి.
కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులను బ్లాక్ చేయించాలి.
'Find My Device' (ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్) ద్వారా ఫోన్లోని డేటాను రిమోట్గా డిలీట్ చేయండి.
సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ పొందండి.


