జురెల్ క్యాచ్‌పై వివాదం | Controversy Hits India vs Sri Lanka 1st Test As Dhruv Jurel Low Catch Splits Internet | Sakshi
Sakshi News home page

జురెల్ క్యాచ్‌పై వివాదం

Aug 18 2026 6:29 PM | Updated on Aug 18 2026 6:40 PM

Controversy Hits India vs Sri Lanka 1st Test As Dhruv Jurel Low Catch Splits Internet

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ పట్టిన ఓ క్యాచ్ వివాదానికి దారితీసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లహిరు ఉదారాను ఔట్ చేసేందుకు అతడు తీసుకున్న లో క్యాచ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ వేసిన బంతిని ఉదారా డిఫెన్స్ చేయబోయాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తగిలి గల్లీ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జురెల్ అద్భుతంగా కిందకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.

అయితే బంతి నేరుగా జురెల్ చేతిలో పడిందా..? లేక ముందుగా నేలను తాకిందా..? అనే అనుమానం తలెత్తింది. ఫీల్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు పంపాడు.

రిప్లేలలో కూడా పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి జురెల్ చేతుల్లోకి వెళ్లే సమయంలో నేలను తాకినట్లు కొందరికి అనిపించగా, మరికొందరు బంతి నేలను తాకకుండానే జురెల్ క్యాచ్ పూర్తి చేశాడని వాదించారు.

చివరికి థర్డ్ అంపైర్ భారత్‌కు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడు. దీంతో లహిరు ఉదారా ఔట్‌గా వెనుదిరిగాడు.

అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు జురెల్ క్యాచ్‌ను అద్భుతమైనదిగా అభివర్ణించగా, మరికొందరు బంతి నేలను తాకిందని పేర్కొంటూ థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ప్రశ్నించారు.

లంక టార్గెట్‌ 372
తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసిన భారత్.. శ్రీలంకను 284 పరుగులకుఆలౌట్ చేసి 174 పరుగుల ఆధిక్యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.

విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్‌
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్‌ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. 

అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో సోనల్‌ దినుష (25), కెప్టెన్‌ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement