PC: BCCI X
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్రౌండ్ ప్రతిభతో ఆతిథ్య జట్టుకు 372 పరుగుల మేర మంచి లక్ష్యాన్ని విధించింది. కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.
లంకకు సులువేనా?
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా టీమిండియాకు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 44, రిషభ్ పంత్ 66 పరుగులతో రాణించడంతో ఈ మేర టార్గెట్ సాధ్యమైంది. మరి టెస్టుల్లో శ్రీలంక అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
టెస్టుల్లో శ్రీలంక ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే?
కొలంబో వేదికగా 2017లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో శ్రీలంక 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 2006లో కొలంబోలోనే సౌతాఫ్రికా విధించిన 352 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది.
గాలెలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాలేదు
అయితే, గాలెలో మాత్రం ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోవడం గమనార్హం. చివరగా 2022లో పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ శ్రీలంక గనుక ఇప్పుడు టీమిండియా విధించిన టార్గెట్ పూర్తి చేస్తే గాలెలో అదే రికార్డు ఛేజింగ్ అవుతుంది.
అయితే, లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 21 పరుగులకే మూడు వికెట్లు ల్పోయింది. దీనిని బట్టి ఛేజింగ్ దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టుకు బుధవారం (ఆగష్టు 19) ఆటకు చివరి రోజు.
చదవండి: చరిత్ర సృష్టించిన పంత్


