source: X
భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్ గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ బ్యాటర్ పసిందు సూరియబండారాను కంకషన్ సబ్స్టిట్యూట్గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
నాలుగో రోజు ఆటలో నాలుగో ఓవర్ ముగిసే సమయంలో చండిమల్ గాయపడ్డాడు. బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో డైవ్ చేసిన అతడు ప్రమాదకరంగా కిందపడటంతో కుడి భుజం, మెడ ప్రాంతంలో గాయమైంది. నొప్పితో అతడు మైదానంలోనే మెడను పట్టుకుని కొంతసేపు పడుకున్నాడు.
వెంటనే జట్టు ఫిజియో, వైద్యుడు అతడిని పరీక్షించారు. అనంతరం స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఎలాంటి అంతర్గత గాయం కనిపించలేదని శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. అయితే కంకషన్ కారణంగా మిగిలిన టెస్టుకు చండిమల్ అందుబాటులో ఉండడని తెలిపింది.
సూరియబండారా అరంగేట్రం
చండిమల్ స్థానంలో వచ్చిన 26 ఏళ్ల పసిందు సూరియబండారాకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 54.36 సగటుతో 14 సెంచరీలు సాధించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పంత్ (66) అర్ద సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) చేసి, శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది.
ఈ ఇన్నింగ్స్లో పంత్తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.


