న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్మిషన్ టవర్ను ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ జంట టవర్ పైకి చేరి, ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించింది.
ఈ సాహసం తర్వాత వారు టవర్ కింద ఉన్న ఒక ప్లాట్ఫారమ్కు చేరుకున్నాక, సదరు వ్యక్తి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని తనతో ఉన్న మహిళకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె అంగీకరిస్తూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించి, అతడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
WATCH: Masked individuals climb Empire State Building and unfurl banner reading ‘When the power of love beats the love of power the world knows peace’ pic.twitter.com/rLohX2VeOE
— Rapid Report (@RapidReport2025) July 1, 2026
సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ హెలికాప్టర్ వెంటనే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో ఆ జంట కిందకు దిగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యూజెర్సీకి చెందిన ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి సాహసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా భవనంలో ఉన్న సందర్శకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్’ అతలాకుతలం


