అయోధ్య విరాళాల లెక్కింపు.. రూల్స్‌ మరింత కఠినం | Ayodhya RAM Temple Tightens Donation Counting Protocol | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల లెక్కింపు.. రూల్స్‌ మరింత కఠినం

Jul 4 2026 4:54 PM | Updated on Jul 4 2026 5:13 PM

Ayodhya RAM Temple Tightens Donation Counting Protocol

అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపు నిబంధనలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కఠినతరం చేసింది. రామ మందిరంలో విరాళాల చోరీ నేపథ్యంలో జేబులు ఉన్న దుస్తులు, ఫోన్లపై నిషేధం విధిస్తూ.. క్షేత్ర ట్రస్ట్ భారీ మార్పులను ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులను కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే ముందు రెండు అంచెలుగా తనిఖీలు నిర్వహిస్తారు.

నగదు, ఇతర విలువైన వస్తువులను దాచిపెట్టే అవకాశాన్ని పూర్తిగా నివారించడానికి.. కౌంటింగ్ సిబ్బంది అందరూ జేబులు లేని ముదురు నీలం రంగు (డార్క్ బ్లూ) యూనిఫాంలను ధరించడం తప్పనిసరి చేస్తూ కొత్త డ్రెస్ కోడ్‌ను తీసుకొచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. సిబ్బంది ఇకపై టేబుళ్లు, కుర్చీలలో కూర్చోవడానికి బదులుగా.. నేలపై కూర్చుని విరాళాలను లెక్కిస్తారు.

కౌంటింగ్ హాల్‌లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఇతర వ్యక్తిగత వస్తువులను పూర్తిగా నిషేధించారు. ఉద్యోగులు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే తమ బూట్లు, చెప్పులను విప్పి రావాల్సి ఉంటుంది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తున్న తరుణంలో ఈ కఠిన భద్రతా చర్యలు అమలులోకి వచ్చాయి.

సిట్ తన దర్యాప్తులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాలపై రీ-ఆడిట్‌ను నిర్వహించనుంది. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన ఖాతాలను పరిశీలిస్తారు. ఆలయ నిర్మాణ వ్యయంతో పాటు నగదు, బంగారం, వెండి, నగలు, ఇతర విలువైన వస్తువుల రూపంలో వచ్చిన విరాళాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. జూన్ 7న ఈ నిధుల దుర్వినియోగం వెలుగులోకి రాగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు బృందం ప్రాథమిక పరిశీలనల ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు.

ఈ వారంలోనే అయోధ్య పోలీసులు ఈ కేసులో కీలక నిందితుడైన అవినాష్ శుక్లాను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆలయ విరాళాల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్న శుక్లాను గతంలోనే అరెస్ట్ చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దర్యాప్తులో ఇప్పటివరకు అత్యధిక నగదు రికవరీ అతని నుంచే జరిగింది. సిట్‌ బృందం మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ అధికారి గోపాల్ రావులను విచారించింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇప్పటికే తమ రాజీనామాలను సమర్పించగా.. జూలై 6న జరగబోయే సమావేశంలో ట్రస్ట్ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement