స్టార్ హీరో ధనుశ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాను చదివిన పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. అక్కడ ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా అందించారు. ఈ వార్త తెలిసిన అభిమానులు సోషల్మీడియాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.
చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయి సత్య మెట్రిక్యులేషన్ స్కూల్లో ధనుశ్ పదో తరగతి వరకు చదువుకున్నారు. పాఠశాలలో ఉన్న పాత భవనాన్ని తొలగించి, దాని స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి 'ధనుష్ బ్లాక్' అని పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవానికి ధనుశ్ తన సహ విద్యార్థి, సినిమాటోగ్రాఫర్ కుమరన్తో కలిసి హాజరయ్యారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
కుమరన్ మాట్లాడుతూ.. ‘కిండర్గార్టెన్ నుంచి పదో తరగతి వరకు మేమిద్దరం ఇదే పాఠశాలలో చదివాం. తర్వాత వేర్వేరు మార్గాల్లో వెళ్లినా మా స్నేహం కొనసాగింది. పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుశ్.. కోట్లు ఖర్చుపెట్టి వెంటనే కొత్త భవనం నిర్మించేందుకు ముందుకురావడంతో పాటు మిగిలిన భవనాలను కూడా పునరుద్ధరించి, ఖాళీ స్థలాల్లో కొత్త నిర్మాణాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఆయన చేసిన సాయం మర్చిపోలేనిది’అని ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నటుడిగా, దర్శకుడిగా రెండు జాతీయ పురస్కారాలు అందుకున్న ధనుశ్ ప్రస్తుతం రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.


