కోలీవుడ్ హీరో ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో తన సొంత నిధులతో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ధనుశ్.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మీరంతా మాతృభాష పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. తమిళం రాకపోవడం కరెక్ట్ కాదని.. అది నిజంగా సిగ్గుచేటని విద్యార్థులకు చురకలంటించారు. ఈ సందర్భంగా ధనుష్ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ఇతర భాషలలో ప్రావీణ్యం సంపాదించే ముందు విద్యార్థులు మొదట తమ మాతృభాషను చదవడం, రాయడం నేర్చుకోవాలని ధనుశ్ విజ్ఞప్తి చేశారు.
ధనుశ్ మాతృభాష గురించి మాట్లాడుతూ.. "ఒకరు మొదట తమ మాతృభాషను నేర్చుకోవాలి. వారు మొదట దానిని చదవడం, రాయడం నేర్చుకోవాలి. మీకు తమిళం రాదని చెప్పడం గర్వించదగిన విషయం కాదు. మీ మాతృభాష తెలియకపోవడం నిజానికి అవమానకరం. దయచేసి మీ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వండి. దయచేసి తమిళంపై కూడా దృష్టి పెట్టండి" అని విద్యార్థులకు సూచించారు.
ధనుశ్ మాట్లాడుతూ..'చిన్నప్పుడు తాను ఇంగ్లీషుతో ఇబ్బంది పడినప్పటికీ.. తమిళంలో మాత్రం ఎప్పుడూ అనర్గళంగా మాట్లాడేవాడినని గుర్తుచేసుకున్నారు. నేను ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు.. బాగా మాట్లాడలేకపోయేవాడిని. కానీ తమిళంలో అనర్గళంగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అది మారింది. ఈ రోజు నేను ప్రజలను కలిసినప్పుడు, పది మందిలో ఎనిమిది మందికి తమిళం సరిగ్గా చదవడం, రాయడం రాదు, కానీ వారు ఇంగ్లీషులో చాలా నిష్ణాతులు. ఇది నన్ను చాలా నిరుత్సాహనికి గురిచేస్తోంది" అని ఆయన అన్నారు. ఆ తర్వాత బెల్జియంలో ఓ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. అది మాతృభాష పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చిందని తెలిపారు.
ధనుశ్ మాట్లాడుతూ.. "నేను ఒక ఫ్రెంచ్ ప్రొడక్షన్ సినిమాలో నటించా. ఆ మూవీ షూటింగ్ బెల్జియంలో జరిగింది. మీకు ఇంగ్లీష్ తెలుసా అని అక్కడి వాళ్లు అడిగినప్పుడ తెలుసని చెప్పా. దానికి వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇంగ్లీష్ రాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ నేను తెలుసని చెప్పినప్పుడు వాళ్లంతా షాకయ్యారు. ఎందుకని అడిగితే'మీకు మీ మాతృభాష బాగా తెలిసు. ఇంగ్లీష్ ఒక బోనస్ కదా?' అని బదులిచ్చారు. వాళ్లు మాతృభాషను ఆ విధంగా చూస్తారు" అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ధనుశ్ ప్రస్తుతం 'ఓం: చాప్టర్ 1' చిత్రంలో నటిస్తున్నారు.


