'రామాయణ'.. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటన వచ్చిన తొలి రోజుల్లో ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే అంశంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారానికి ఎట్టకేలకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ ఫుల్స్టాప్ పెట్టారు. మొదటి నుంచి తమ మనసులో ఉన్న ఏకైక పేరు రణ్బీర్ కపూర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఓ మీడియా సమావేశంలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘స్క్రిప్ట్ పూర్తయ్యాక శ్రీరాముడి పాత్రకు రణ్బీర్ కపూర్నే ఊహించుకున్నాం . ఆప్షన్-ఏ, ఆప్షన్-బీ, ఆప్షన్-సీ అంటూ ఏమీ లేదు. రణ్బీర్ మాత్రమే మా తొలి ఎంపిక. ముందుగా ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ ఆయన తిరస్కరిస్తేనే మరో హీరో గురించి ఆలోచించేవాళ్లం" అని వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకుడు నితేశ్ తివారీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. రణ్బీర్కు ప్రత్యామ్నాయంగా మరో హీరో పేరును అసలు పరిశీలించలేదన్నారు. దీనిపై స్పందించిన రణ్బీర్ కపూర్.. ‘అంటే ఇప్పుడు వీళ్లకు ఇంకో ఆప్షన్ కూడా లేదు కదా!’ అంటూ సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.
ఇక రావణుడి పాత్రకు యశ్ ఎలా ఎంపికయ్యారనే విషయంపైనా నమిత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'కేజీఎఫ్: ఛాప్టర్-2' తర్వాత యశ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందని, ఆ సమయంలో లాస్ ఏంజెల్స్లో ఆయనను కలిసి 'రామాయణ' విజన్ను వివరించామని చెప్పారు. కథ, పాత్ర నచ్చడంతో యశ్ రావణుడిగా నటించడమే కాకుండా నిర్మాతగానూ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని తెలిపారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. అలాగే రవీ దూబే, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


