నీట్ విద్యార్థి బలవన్మరణంపై ఎక్స్లో రాహుల్ గాంధీ ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అభ్యర్థిని బలవన్మరణంపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేపదే జరుగుతున్న ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలతో విద్యార్థుల భవిష్యత్ కలలు చెదిరిపోతున్నాయని రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు, నీట్ పరీక్ష నిర్వహణలో అసమర్థ వార్తలతో తీవ్రంగా కలతచెంది మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే అభ్యరి్థని నాగ్పుర్లో బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
ఆత్మహత్య ఘటనపై రాహుల్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఆకాంక్ష వైద్యవిద్య పూర్తిచేసి డాక్టర్గా రాణించి, సమాజానికి సేవ చేయాలని ఎంతో ఆశపడింది. ఆమె తండ్రి ఓ సాధారణ రైతు. కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,00,000 అప్పు తీసుకున్నారు. నాగ్పుర్లో ఆమె కోచింగ్ క్లాస్లకు వెళ్లడానికి వీలుగా తండ్రి వంటమనిషిగా ఉద్యోగం చేశారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారు,
కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయింది. దానిని తట్టుకోలేక ఆకాంక్ష బలవన్మరణానికి పాల్పడింది. ఆకాంక్ష మరణం కేవలం బలవన్మరణం కాదు. అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థ ఇచ్చిన బహుమతి. ఇక ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఇప్పటికీ అదే కురీ్చలో ఉన్నారు. అవే పాత కమిటీలు, బదిలీలు, విచారణలు. సంస్కరణలు లేవు. న్యాయమూ లేదు. మోదీజీ.. అధికార పీఠం శాశ్వతం కాదు. అది వస్తుంటుంది, పోతుంటుంది’’అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


