రైతన్నలకు ఆర్థిక సాయం పథకం 2031 వరకు పొడిగింపు
పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లు కేటాయింపు
‘సముద్ర మంథన్’కు రూ.84,084 కోట్లు
రూ. 5,070 కోట్లతో ‘పీఎం సూర్య సరోవర్’
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలకు ఆర్థిక మద్దతును పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు ప్రతిఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లు కేటాయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. 2026–2031 కాలానికి సంబంధించి వ్యవసాయంతోపాటు పునరుత్పాదక ఇంధనం, చమురు అన్వేషణకు భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వివరాలు, పథకాల గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
పీఎం–కిసాన్తో సత్ఫలితాలు
పీఎం–కిసాన్ పథకంలో ఆశించిన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని డెవలప్మెంట్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్ ఆఫీస్(డీఎంఈఓ) నివేదిక ప్రకారం.. 92 శాతం మంది లబి్ధదారులు ఈ నగదును నేరుగా వ్యవసాయ పనులకు వినియోగించారు. 85 శాతం రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, ప్రైవేట్ అప్పులపై ఆధారపడటం తగ్గిందని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం అమలుతో 2020–21 నుంచి 2025–26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 9.65 శాతం, ఉత్పాదకత 10.53 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 21.18 శాతం వృద్ధి నమోదైంది.
చమురు అన్వేషణకు ‘సముద్ర మంథన్’
దేశీయంగా చమురు, సహజ వాయువుల అన్వేషణ, ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం ‘సముద్ర మంథన్’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.84,084 కోట్లు కేటాయించారు. సముద్రగర్భ అన్వేషణల ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆఫ్షోర్ టెక్నాలజీ పెంపు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధన దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌర విద్యుత్కు ‘పీఎం సూర్య సరోవర్’
జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్) ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం–ఎస్ఎస్వై)’ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి రూ.5,070 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 నుంచి 2030–31 మధ్య ఈ ప్రాజెక్టులను మంజూరు చేస్తారు. 2032–33 వరకు ఆర్థిక సాయం కొనసాగిస్తారు. పూర్తయిన ప్రాజెక్టులకు మెగావాట్కు రూ.కోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయం(సీఎఫ్ఏ) కింద అందజేస్తారు.
ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందజేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా జలాశయాలపై 102.18 గిగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ప్రస్తుతం 700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ప్రాజెక్టుల వల్ల భూమి కొరత సమస్యను అధిగమించవచ్చు. ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతోపాటు 16 వేల నుంచి 17 వేల వరకు పూర్తిస్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.


