నాలుగు రోజులుగా ఉభయసభల్లో ఒకే తంతు పునరావృతం
పార్లమెంట్లో షరతులు లేని చర్చకు సిద్ధమన్న కేంద్రం
ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు రెడీ అన్న విపక్షాలు
పార్లమెంట్ వెలుపల పోటాపోటీ నిరసనలకు దిగిన అధికార, విపక్ష కూటమి ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో అవే నినాదాలు, ప్రభుత్వ వైఖరి పదేపదే పునరావృతమవుతున్నాయి. ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై ప్రభుత్వం జవాబుదారీ వహించాలని విపక్షపార్టీల ఎంపీలు పార్లమెంట్లో గురువారమూ నినదించారు. ఎలాంటి షరతులు లేకుండా చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే చర్చలకు సుముఖత వ్యక్తంచేస్తామని విపక్ష ఎంపీలు భీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో లోక్సభ, రాజ్యసభల్లో నాలుగో రోజూ ప్రతిష్టంభన రాజ్యమేలింది. విపక్షాల ఆందోళనల నడుమ ఇరుసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
ఉదయం నుంచి అదే తంతు...
ఉభయసభల్లోనూ గురువారం సైతం నీట్ లీకేజీ, విద్యార్థులను కర్కశంగా పోలీసులు చితకబాదడంపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ఆరంభమైన వెంటనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎంత కాలమైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ వివాదం తర్వాత తీసుకున్న చర్యలు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తీసుకున్న చర్యలపై చర్చకు అనుమతించాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
‘మేము నిన్న విజ్ఞప్తి చేశాము. ఈ రోజు మీ ద్వారా సభకు మళ్ళీ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడాం. మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీ సూచనలు పంచుకోవాలని వారిని ఆహ్వానించాం. దయచేసి చర్చను ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయించాలని మేము ప్రతిపక్షాన్ని చేతులు జోడించి అభ్యరి్థస్తున్నాం. అలాకాకుండా షరతులు విధిస్తూ, సాకులు చెబుతూ ఉండే విపక్షం చర్చను తప్పించుకోవాలలని చూస్తోందని అందరూ అర్థం చేసుకుంటారు. లీకేజీ అంశాన్ని రాజకీయం చేయొద్దు’’అని కోరారు.
రాజీనామా తర్వాతే చర్చ: ఖర్గే
రిజిజు ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్ పేపర్ లీక్పై 267వ నిబంధన కింద చర్చ కోరామని, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు. ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేసిన తర్వాతే చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ అదే అంశంపై సమాధానం ఇవ్వడం సరికాదన్నారు.
స్పీకర్ను విడిగా కలిసిన రాహుల్, అమిత్ షా
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాం«దీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, సౌగత రాయ్ తదితరులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, సభా నిబంధనల ప్రకారం చర్చకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉభయసభలు గురువారానికి వాయిదాపడ్డాక హోం మంత్రి అమిత్ షా సైతం స్పీకర్ బిర్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల్లో చర్చించిన వివరాలు వెల్లడికాలేదు.
పోటాపోటీగా నిరసనలు
పార్లమెంట్ ఆవరణలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం ఆందోళన కొనసాగించింది. ప్రధాని నివాసం వద్ద రాహుల్గాంధీ తదితర నేతలు నిరసనకు దిగడాన్ని తప్పుబడుతూ ఎన్డీఏ ఎంపీలూ పోటీగా నిరసన చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘యువతను రెచ్చగొట్టొద్దు. రాహుల్ గాంధీ హోష్లోకి రండి’అని ఎన్డీఏ ఎంపీ నినదించారు. ‘ఇండియా’కూటమి ఎంపీలు ‘ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి‘, ‘ప్రాణాలు కాపాడండి.. నీట్ను రద్దు చేయండి’, ‘బుద్ధి తెచ్చుకోండి’, ‘వందేమాతరం’అని రాసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాం«దీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్లకార్డు లాక్కునే యత్నం
నిరసనల సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలే చేతిలో ఉన్న ప్లకార్డును ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అధికారపక్ష సభ్యులు తమ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


