అక్రమ సంబంధం ముందు తేల్చండి, ఆ తరువాతే భరణం! | Allegation Must First Be Established Conclusively says Supreme Court | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం ముందు తేల్చండి, ఆ తరువాతే భరణం!

Aug 1 2026 5:11 AM | Updated on Aug 1 2026 5:11 AM

Allegation Must First Be Established Conclusively says Supreme Court

అక్రమ సంబంధం రుజువైతే భృతి చెల్లదు 

కాబట్టి ముందుగా ఈ అంశం తేలాలి 

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: అక్రమ సంబంధాల కారణంగా విడాకులు కోరే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భర్త అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తే భార్యకు మధ్యంతర భృతి ప్రకటించే ముందుగానే ఆ విషయాన్ని తేల్చాలని తెలిపింది. ఈ విషయాన్ని చిట్టచివర నిర్ణయించవచ్చు అని అనుకుంటే కోర్టులు తప్పు చేసినట్టు అవుతుందని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

అక్రమ సంబంధం రుజువైతే భార్యకు అటు మధ్యంతర భృతి, ఇటు భరణంపై హక్కు ఉండదని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 125 (4) చెబుతుంది కాబట్టి భర్త ఈ సెక్షన్‌ కింద అప్లికేషన్‌ దాఖలు చేసి సాక్ష్యాధారాలతో అక్రమ సంబంధాన్ని రుజువు చేస్తే మధ్యంతర భృతిపై నిషేధం విధించవచ్చు అని బెంచ్‌ తెలిపింది. అక్రమ సంబంధం కలిగి ఉందన్న కారణంగా భరణం చెల్లించకుండా చేయాలని వేసిన పిటిషన్‌ను రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేయడంతో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి... 

పిటిషనర్‌కు 2014 జూలైలో వివాహమైంది. ఆ తరువాత కొన్నేళ్లకు ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ మహిళ భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. 2020 మే 13న భర్తను వదిలి పిల్లవాడు, విలువైన వస్తువులతో అత్తవారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి తనకు మధ్యంతర భృతి కల్పించాలని కోరుతూ ఉదయ్‌పూర్‌లోని స్పెషల్‌ అడిషనల్‌ చీప్‌ జస్టిస్‌ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. దీంతో భర్త కూడా సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 (4) కిందభార్య అక్రమ సంబంధం కలిగి ఉందని, కాబట్టి ఆమెకు మధ్యంతర భృతి వర్తించదని వాదించారు.

 అయితే ఈ వాదనను న్యాయమూర్తి కొట్టివేశారు. అయితే సుప్రీంకోర్టు తన తీర్పునిస్తూ భార్య అక్రమ సంబంధం కలిగి ఉందనేందుకు ఫొటోల రూపంలో సాక్ష్యాలను అందించారని వీటితో అక్రమ సంబంధం నిరూపితమవుతుందా? లేదా? అన్నది మధ్యంతర భృతిపై నిర్ణయానికి ముందే న్యాయస్థానాలు నిర్ధారించాలని స్పష్టం చేసింది. సాక్ష్యాలను భార్య సవాలు చేయవచ్చునని తెలిపారు. ఈ అంశాలను పట్టించుకోకుండా ట్రయల్‌కోర్టు భర్త దాఖలు చేసిన సెక్షన్‌ 125 (4) అప్లికేషన్‌ను తిరస్కరించడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో భర్త ప్రైవేట్‌ డిటెక్టివ్‌ల సాయంతో భార్య తాలూకూ ఫొటోలు, వీడియోలు సేకరించడంపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. సాక్ష్యాల సేకరణకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త పద్ధతులు చేపట్టాల్సిన అవసరమెంతైనా ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తామిచ్చిన తీర్పు కాపీని కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి, లా కమిషన్‌ అధ్యక్షుడికి పంపాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement