నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల టెర్మినల్ను పరిశీలించిన అనంతరం 11.30 గంటలకు జాతికి అంకితం చేస్తారు. ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ.. ఈ ప్రాంతానికి మణిహారంగా మారనుంది ఈ విమానాశ్రయం. ప్రారంభోత్సవం అనంతరం అదే వేదిక నుంచి రాష్ట్రంలోని రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు.
అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శనివారం ప్రధాని ప్రారంభించనున్న భారీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓశాట్) ఫెసిలిటీ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. మొదటి విడత రూ.542.19 కోట్లు, రెండో విడత రూ.1,845.61 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ వాచ్లు, ఐఓటీ పరికరాలకు కావాల్సిన అధునాతన 2.5డీ, త్రీడీ చిప్ ప్యాకేజింగ్, టెస్టింగ్ సేవలను ఇక్కడ అందించనున్నారు.


