రియల్ ఎస్టేట్ లాబీకి చంద్రబాబు సర్కారు కానుక
భద్రత గాలికి.. నీరుగారిన భవన నిర్మాణ నిబంధనలు
ఫీజుల చెల్లింపుల్లోనూ రాయితీ
ఫైర్ ఎన్ఓసీ రాకముందే స్టిల్ట్తో కలిపి 24 మీటర్ల వరకు భవనాలు కట్టుకోవచ్చు
సామాన్యులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు
జీఓ–161తో బిల్డింగ్ రూల్స్– 2017కు సవరణలు
సాక్షి, అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుల భద్రతను గాలికి వదిలేసింది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరిచింది. ఏపీ బిల్డింగ్ రూల్స్–2017కు భారీ సవరణల పేరిట ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓ–161 పూర్తిగా బడా నిర్మాణదారులకు మేలు చేసేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫైర్ ఎన్ఓసీ లేకుండానే..
కొత్త జీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ ఎన్ఓసీ లేకుండానే 24 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు అనుమతులిచ్చింది. ఫీజుల చెల్లింపుల్లోనూ బిల్డర్లకే రాయితీలిచ్చింది. నిర్మాణ ప్రాజెక్టుల్లో జాప్యం నివారణ పేరిట బాబు సర్కారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైరైజ్ భవనాలకు ఒకేసారి కాకుండా దశలవారీగా ఫైర్ క్లియరెన్స్ విధానాన్ని తీసుకురావడం విస్మయం కలిగిస్తోంది.
తాజా నిబంధనల ప్రకారం.. అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్) రాకముందే స్టిల్ట్ ఫ్లోర్తో కలిపి 24 మీటర్ల ఎత్తువరకు భవనాన్ని నిర్మించేసుకునేందుకు ప్రభుత్వం బిల్డర్లకు అనుమతిచ్చేసింది. ఒకవేళ నిర్మాణం పూర్తయ్యాక ఫైర్ సేఫ్టీ ప్రమాణాల్లేక ఎన్ఓసీ రాకపోతే ఆ భవనాల పరిస్థితి ఏంటి? అక్కడ ఏమైనా అగ్నిప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు? అనే ప్రశ్నలకు జీఓలో స్పష్టతలేదు. గతంలో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఫైర్ ఎన్ఓసీ అందజేయాల్సి ఉండేది. 18 మీటర్లు, ఆపై ఎత్తు కలిగిన భవనాలను హైరైజ్ కేటగిరీ కింద పరిగణించేవారు.
బడా బాబులకు మినహాయింపులు..
నిర్మాణ రంగానికి ప్రోత్సాహం పేరుతో బిల్డర్లు చెల్లించాల్సి న ఫీజుల విషయంలో చంద్రబాబు సర్కారు ఉదారంగా వ్యవహరించింది. బడా బిల్డర్లు కట్టాల్సిన సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజును ఒకేసారి కాకుండా మూడేళ్ల వ్యవధిలో ఆరు వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. గడువు ముగిసిన అనుమతుల రెన్యువల్కు కూడా సులభ మార్గాలు తెరిచింది. మరోవైపు.. హైరైజ్ పేరిట నిబంధనలు తుంగలోకి తొక్కింది.
సెట్ బ్యాక్స్కు కోత..
24 మీటర్లు, అంత కన్నా ఎత్తు ఉండే భవనాలనే హైరైజ్ భవనాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సెట్ బ్యాక్స్ (భవనం చుట్టూ వదిలే ఖాళీ స్థలం) నిబంధనలను సడలించింది. మరోవైపు.. టీడీఆర్ వినియోగాన్ని విస్తృతం చేస్తూ అదనపు అంతస్తుల నిర్మాణానికి తలుపులు తెరిచేసింది. దీనివల్ల భవనాలకు గాలి, వెలుతురు రాకుండా నగరాలు మరింత ఇరుకుగా, కాంక్రీట్ జంగిల్గా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పార్కింగ్ ఫ్లోర్లు లెక్కల్లోకి రావు..
భవనంలో నిర్మించే పార్కింగ్ ఫ్లోర్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మరిన్ని అంతస్తులు కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్విరాన్మెంట్ డెక్, సర్వీసు ఫ్లోర్, స్టిల్ట్ రిసెప్షన్ ఏరియా ఎత్తు లెక్కింపు నుంచి తొలగించి బిల్డర్లకు అదనపు ప్రయోజనాలు ఇచ్చింది. టీడీఆర్ ద్వారా నాన్ హైరైజ్, హైరైజ్ రెండింటికీ అదనంగా రెండు అంతస్తులు నిర్మించుకోవడానికి మార్గం చూపింది.
సాధారణ ఇంజినీర్లపై దెబ్బ..
ఇకపై 10 మీటర్లు ఎత్తు దాటిన భవనాలకు స్ట్రక్చరల్ డిజైన్లు లైసెన్స్డ్ ఇంజినీర్ నుంచి సర్టిఫై చేయించుకోవాలి. సాధారణ ఇంజినీర్ ఇచ్చిన డిజైన్లు అనుమతించరు. దీంతో.. తాజా నిబంధనలు తమపాలిట శాపంగా మారాయని సాధారణ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు వాపోతున్నారు.
ఉత్తుత్తి మినహాయింపులేనా?..
ప్రార్థనా మందిరాలకు ఫీజు మినహాయింపు ప్రకటించిన ప్రభుత్వం అందులోనూ మెలిక పెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగం లేకుంటేనే వర్తింపు అనే షరతు విధించింది. మిగిలిన భవనాల మాదిరిగానే ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు కూడా ఆన్లైన్ దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరి చేసింది. ఈ పరిణామాలు గమనించిన నిపుణులు నిజమైన మినహాయింపులు ఎంత అనేవి ప్రశ్నార్థకమని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈవీ స్టేషన్లునిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించుకోవడానికి బడా బిల్డర్లకు అవకాశం కల్పించిన చంద్రబాబు సర్కారు మరో కొత్త డ్రామాకు తెరతీసింది.
5,000 చదరపు మీటర్లు దాటిన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు, క్రెష్లు, ఎన్విరాన్మెంటల్ డెక్ నిర్మించాలని పేర్కొంది. అయితే, ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఎవరు నిర్వహించాలో స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి.. ఇవన్నీ బిల్డర్లు తమ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో నగరాలకు పొంచి ఉన్న ముప్పును నిబంధనల సరళీకరణ ఆపలేదని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


