రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో మరింత బరితెగించిన చంద్రబాబు సర్కార్
రూ.300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల దందాను ఇటీవల వెలుగులోకి తెచ్చిన సాక్షి.. ఆ కథనంపై కోర్టులో కేసు దాఖలుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి
ఎడిటర్, పబ్లిషర్ తదితరులపై కేసు నమోదుకు ఆదేశాలు
ఈ మేరకు ప్రత్యేక జీవోఆర్టీ 1486 జారీ చేసిన చీఫ్ సెక్రటరీ
వాస్తవాలు రాస్తే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం
ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు అడుగడుగునా ప్రయత్నం
ఎడిటర్పై సగటున నెలకు ఒక కేసు నమోదు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కక్షసాధింపు.. వరుస అక్రమ కేసులు
సాక్షి, అమరావతి: ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మాకు పనిలేదు. మేం చేసే అవినీతి, అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం’ అన్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరింత బరితెగించింది. సాక్షిలో ప్రచురితమైన ఒక కథనానికి సంబంధించి కోర్టులో కేసు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ ఏకంగా జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రధానంగా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టిస్తోంది. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తోంది.
ఎడిటర్ పై నెలకు ఒక కేసు నమోదవుతోందంటే అక్రమాలను వెలుగులోనికి తెస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎడిటర్, పబ్లిషర్ తదితరులపై మరో అక్రమ కేసు నమోదుకు అనుమతినిస్తూ శుక్రవారం చీఫ్ సెక్రటరీ ప్రత్యేక జీవోఆర్టీ 1486 జారీ చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన అద్వైక ట్రేడింగ్ కంపెనీ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ వ్యవహారానికి సంబంధించిన కథనంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తరఫున న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఈ జీవో ద్వారా అనుమతి ఇచ్చారు.
తగిన ఆధారాలతోనే కథనం
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అద్వైక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు, బాధితుల సమస్యలు, కేసు పరిష్కార ప్రక్రియపై తగిన ఆధారాలతోనే సాక్షి లో కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో దర్యాప్తును ప్రభావితం చేశారనే ఆరోపణలు, నిందితులతో అనధికారికంగా పరిష్కారం కుదిరిందనే అనుమానాలు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు కథనంలో ప్రస్తావించింది.
ఈ ఆరోపణలు వాస్తవమా? కాదా? అన్నది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలే. ఆరోపణలు నిరాధారమైతే సంబంధిత అధికారులు వాస్తవాలను వెల్లడించి ప్రజలకు స్పష్టత ఇవ్వవచ్చు. అయితే అందుకు బదులుగా పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడమే లక్ష్యంగా కేసు నమోదుకు ఏకంగా జీవోను జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా గొంతు నులిమేందుకు తప్పుడుదారులు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని మీడియా ప్రశ్నించడం సహజమైన ప్రక్రియ. ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఆర్థిక మోసాలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత. అయితే ఒక వార్తపై అభ్యంతరం ఉంటే వివరణ ఇవ్వడం, వాస్తవాలను వెల్లడించడం, అవసరమైతే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం సాధారణ ప్రక్రియ.
కానీ వార్తా కథనాల కారణంగా మీడియా సంస్థలు, పబ్లిషర్లు, రిపోర్టర్లపై కేసులకు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే. నిజాలను ప్రశ్నించే మీడియా గొంతుకను అణచివేస్తే, ప్రజలకు వాస్తవాలు చేరే మార్గాలు మూసివేయవచ్చనే దురభిప్రాయంతో కూటమి ప్రభుత్వం తప్పుడుదారుల్లో అక్రమ కేసులు పెడుతోంది.
రాజకీయ, మీడియా వర్గాల ఖండన
పత్రికా స్వేచ్ఛ అణచివేతకు ప్రత్యేక జీవో జారీ చేయడాన్ని రాజకీయ, మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘వార్తలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వడం లేదా ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడం అనేది బాధ్యతగల ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ అది మానేసి, కథనం ప్రచురించిన పత్రికా సంస్థ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలకు అనుమతి ఇవ్వడం ఏమిటి?’ అని పత్రికా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇది ప్రజాస్వామ్యంపై దాడి
వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మాజీమంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మండిపడ్డారు. సాక్షి దినపత్రిక పబ్లిషర్, రిపోర్టర్తో పాటు, వార్త ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీచేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని శుక్రవారం వారు వేర్వేరు ప్రకటనల్లో ఆక్షేపించారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసుకు సంబంధించిన దర్యాప్తు, పరిష్కార ప్రక్రియపై సాక్షి కథనంలో ప్రస్తావించిన అంశాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా ఆ వార్తను ప్రచురించిన పత్రికా ప్రతినిధులపైనే చర్యలకు సిద్ధపడటం అత్యంత దారుణమన్నారు. సమాధానం చెప్పలేక కేసులతో బెదిరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


