breaking news
trading company
-
భారీ డీల్పై దాటవేత!
సాక్షి, అమరావతి: అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను నిండా ముంచిన అద్విక ట్రేడింగ్ కంపెనీ కేసులో డీల్ బాగోతం పోలీసు శాఖను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసు పెద్దల డీల్పై ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ఈ కేసును పారదర్శకంగానే దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసు అధికారులు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి మరీ వివరాలు వెల్లడించారు. కానీ కీలక అంశాలపై దాటవేత వైఖరి అవలంబించడం గమనార్హం. సీఐడీ, ఈడీల పరిధిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ కేసును నీరుగార్చిన విషయాన్ని ‘సాక్షి’ కథనంలో ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రశ్నకు పోలీసు అధికారులు సూటిగా సమాధానం ఇవ్వనే లేదు. ఈ కేసులో బాధ్యులైన అందరినీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు? దర్యాప్తు ప్రక్రియను ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి నివేదించారా? అనే అంశాలపై పోలీసు అధికారులు స్పందించనే లేదు. పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాటవేసిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు బదులేదీ?» అద్విక ట్రేడింగ్ కంపెనీ రూ.53 లక్షలు మోసం చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా 1,334 మంది ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.478.34 కోట్లు అక్రమ డిపాజిట్లు చేసినట్టు తాము గుర్తించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి అంత భారీ ఆర్థిక నేరానికి పాల్పడినట్టుగా పోలీసులు ఈ కేసులో అదనపు వివరాల కింద అధికారికంగా ఎందుకు నమోదు చేయలేదు? ఆ వివరాలను అధికారికంగా నమోదు చేసినట్టు ఎటువంటి ఆధారాలు ఎందుకు చూపించలేదు? ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే మోసం కేవలం రూ.53 లక్షలకే పరిమితం అన్నట్టుగానే ఎందుకు ఉంది? » రూ.478.34 కోట్ల భారీ అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కే ఎందుకు పరిమితం చేశారు? ఈ స్థాయి ఆర్థిక అక్రమాల కేసును సీఐడీకి కదా నివేదించాల్సింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు, అగ్రి గోల్డ్ కేసులను సీఐడీనే విచారించిందన్న వాస్తవాన్ని విజయవాడ పోలీసులు ఎందుకు విస్మరించారు? ఈ విషయంపై డీజీపీ కార్యాలయం ఎందుకు దృష్టి సారించ లేదు? » ఈ కేసులో బాధితులు కేవలం ఎన్టీఆర్ పోలీస్ జిల్లాకే పరిమితం కాలేదు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా బాధితులు ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసి ఆ బాధితులు విజయవాడ పోలీసుల వద్దకు వచ్చి తాము కూడా మోసపోయినట్టు గోడు వెళ్లబోసుకున్నారు. అంటే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో బాధితులు ఉన్న ఆర్థిక అక్రమాల కేసులను సీఐడీకి అప్పగించాలని విజయవాడ పోలీసులకు తెలీదా? తెలిసినా సరే ఆ కేసును సీఐడీకి అప్పగించాలని ఎందుకు భావించ లేదు? కేవలం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎందుకు అట్టిపెట్టి ఉంచారు? » రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ తీవ్రమైన నేరం. ఈ తరహా మోసాల్లో బాధితులు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంటే ఆ కేసులను సీబీఐకి అప్పగించాలని సెక్షన్ 30.30 స్పష్టం చేస్తోంది. అద్విక ట్రేడింగ్ కంపెనీలో డిపాజిట్ చేసి మోసపోయిన వారిలో తెలంగాణకు చెందిన బాధితులు కూడా ఉన్నారు. మరి ఆ కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించ లేదు? సెక్షన్ 11.11 ప్రకారం అక్రమ డిపాజిట్ల కేసు వివరాలను సీబీఐకి నివేదించాలి. ఆ తరహా కేసులను సీబీఐ దర్యాప్తు చేయాలని సెక్షన్ 29 స్పష్టం చేస్తోంది. మరి ఎందుకు అలా చేయలేదు? » ఈ కుంభకోణంలో పాత్రధారులైన 61 మంది ఏజెంట్లను గుర్తించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇందులో 39 మందిని మాత్రమే నిందితులుగా చేర్చి, మిగిలిన వారిని ఎందుకు సాక్షులుగా పేర్కొన్నారు ? అద్విక ట్రేడింగ్ కంపెనీ యజమానులు అందర్నీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు? ఈ ప్రశ్నలకు పోలీసు అధికారులు వివరణ ఇవ్వనే లేదు. » సేకరించిన అక్రమ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మరి ఆ బ్యాంకు ఖాతా తెరిచేందుకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఉంటే విలేకరుల సమావేశంలో ఇదిగో న్యాయస్థానం అనుమతి అని ఎందుకు చూపించలేదు? » అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని వసూలు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఏజెంట్లు ఎలా ఇచ్చారో వెల్లడించలేదు. అద్విక మేనేజ్మెంట్, ఏజెంట్ల కొన్ని ఆస్తులను విక్రయించేలా చేసి ఆ నిధులు ఇచి్చనట్టు తెలుస్తోంది. మరి ఆ ఆస్తులను ఎవరు కొనుగోలు చేశారో ఎందుకు వెల్లడించలేదు? ఆ ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఆ ఆస్తులను బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా.. లేక పోలీసు అధికారుల బినామీలకే తక్కువ ధరకు విక్రయించారా? ఈ విషయంలో విజయవాడ పోలీసులు ఎందుకు పారదర్శకంగా వివరాలు వెల్లడించలేదు? » ఈ కేసులో ఇద్దరు కీలక అధికారుల మధ్య విభేదాలతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చిందని పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆస్తుల విక్రయాలు పర్యవేక్షించిన ఓ అధికారి, బంగారం రికవరీ పర్యవేక్షించిన మరో అధికారి మధ్య ఆధిపత్యపోరు వాస్తవం కాదా? అసలు ఎంత బంగారం రికవరీ చేశారు? ఎంత బంగారం చూపించారు? ఆ వివరాలను ఏజెంట్లుగానీ పోలీసు అధికారులుగానీ ఎందుకు వెల్లడించలేదు? ఈ సందేహాలను నివృత్తి చేస్తేనే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నారని నమ్మకం కలుగుతుందని బాధితులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు ఒరిజినల్ పత్రాలు తీసుకున్నారు అద్విక ట్రేడింగ్ కంపెనీలో నేను దశల వారీగా రూ.23 లక్షలు డిపాజిట్ చేశాను. కానీ మోసపోయానని గుర్తించిన తర్వాత విజయవాడ పోలీసులను కలిశాను. నా వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు చూపించాను. ఆ ఒరిజినల్ పత్రాలను ఓ పోలీసు అధికారి తీసుకున్నారు. న్యాయం చేస్తానన్నారు. కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. నా నుంచి ఒరిజినల్ పత్రాలు తీసుకున్న అధికారి ఇప్పుడు స్పందించడమే లేదు. – శ్రీధర్, బాధితుడు -
ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే. అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది. 1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు. గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్ వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని. ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో. -
బోర్డు తిప్పేసిన ట్రేడింగ్ కంపెనీ
హైదరాబాద్: హైదరాబాద్లో ఓ ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బోయిన్పల్లి కేంద్రంగా నడుస్తున్న ఎక్స్పర్ట్ ట్రేడింగ్ కంపెనీ ఖాతాదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసింది. స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు చూపుతామంటూ పలువురి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి దాదాపు రూ.నాలుగు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ కంపెనీ గత కొద్ది రోజులుగా కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


