‘అద్విక’ వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు
రూ.478.34 కోట్ల వ్యవహారం అన్నప్పుడు సీఐడీ, సీబీఐ, ఈడీలకు ఎందుకు నివేదించలేదు?
రూ.53 లక్షలే మోసం చేసినట్టు ఎఫ్ఐఆర్లో పెట్టడం నిజం కాదా?
ఒకవేళ ఆ మొత్తం పెరిగి ఉంటే అనుబంధ చార్జిషీట్ వేయాలి కదా?
మేనేజ్మెంట్ ప్రతినిధులు, 61 మంది ఏజెంట్లలో 39 మందే నిందితులా?
అధికారి పేరుతో ప్రత్యేక ఖాతా నిర్వహణకు న్యాయస్థానం అనుమతి ఉందా?..ఏజెంట్ల ఆస్తుల విక్రయాలపై పారదర్శకత ఏదీ?
ఆ ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతి ఉందా?
ఆ ఆస్తులను బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా?
లేక పోలీసు అధికారుల బినామీలకు తక్కువ ధరకు విక్రయించారా?
ఆరేడు జిల్లాలు, తెలంగాణలోనూ బాధితులుంటే ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా?
సాక్షి, అమరావతి: అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను నిండా ముంచిన అద్విక ట్రేడింగ్ కంపెనీ కేసులో డీల్ బాగోతం పోలీసు శాఖను ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసు పెద్దల డీల్పై ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ఈ కేసును పారదర్శకంగానే దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసు అధికారులు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి మరీ వివరాలు వెల్లడించారు. కానీ కీలక అంశాలపై దాటవేత వైఖరి అవలంబించడం గమనార్హం.
సీఐడీ, ఈడీల పరిధిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ కేసును నీరుగార్చిన విషయాన్ని ‘సాక్షి’ కథనంలో ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రశ్నకు పోలీసు అధికారులు సూటిగా సమాధానం ఇవ్వనే లేదు. ఈ కేసులో బాధ్యులైన అందరినీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు? దర్యాప్తు ప్రక్రియను ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి నివేదించారా? అనే అంశాలపై పోలీసు అధికారులు స్పందించనే లేదు. పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాటవేసిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
» అద్విక ట్రేడింగ్ కంపెనీ రూ.53 లక్షలు మోసం చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా 1,334 మంది ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.478.34 కోట్లు అక్రమ డిపాజిట్లు చేసినట్టు తాము గుర్తించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి అంత భారీ ఆర్థిక నేరానికి పాల్పడినట్టుగా పోలీసులు ఈ కేసులో అదనపు వివరాల కింద అధికారికంగా ఎందుకు నమోదు చేయలేదు? ఆ వివరాలను అధికారికంగా నమోదు చేసినట్టు ఎటువంటి ఆధారాలు ఎందుకు చూపించలేదు? ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే మోసం కేవలం రూ.53 లక్షలకే పరిమితం అన్నట్టుగానే ఎందుకు ఉంది?
» రూ.478.34 కోట్ల భారీ అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కే ఎందుకు పరిమితం చేశారు? ఈ స్థాయి ఆర్థిక అక్రమాల కేసును సీఐడీకి కదా నివేదించాల్సింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు, అగ్రి గోల్డ్ కేసులను సీఐడీనే విచారించిందన్న వాస్తవాన్ని విజయవాడ పోలీసులు ఎందుకు విస్మరించారు? ఈ విషయంపై డీజీపీ కార్యాలయం ఎందుకు దృష్టి సారించ లేదు?
» ఈ కేసులో బాధితులు కేవలం ఎన్టీఆర్ పోలీస్ జిల్లాకే పరిమితం కాలేదు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా బాధితులు ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసి ఆ బాధితులు విజయవాడ పోలీసుల వద్దకు వచ్చి తాము కూడా మోసపోయినట్టు గోడు వెళ్లబోసుకున్నారు. అంటే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో బాధితులు ఉన్న ఆర్థిక అక్రమాల కేసులను సీఐడీకి అప్పగించాలని విజయవాడ పోలీసులకు తెలీదా? తెలిసినా సరే ఆ కేసును సీఐడీకి అప్పగించాలని ఎందుకు భావించ లేదు? కేవలం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎందుకు అట్టిపెట్టి ఉంచారు?
» రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ తీవ్రమైన నేరం. ఈ తరహా మోసాల్లో బాధితులు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంటే ఆ కేసులను సీబీఐకి అప్పగించాలని సెక్షన్ 30.30 స్పష్టం చేస్తోంది. అద్విక ట్రేడింగ్ కంపెనీలో డిపాజిట్ చేసి మోసపోయిన వారిలో తెలంగాణకు చెందిన బాధితులు కూడా ఉన్నారు. మరి ఆ కేసు దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించ లేదు? సెక్షన్ 11.11 ప్రకారం అక్రమ డిపాజిట్ల కేసు వివరాలను సీబీఐకి నివేదించాలి. ఆ తరహా కేసులను సీబీఐ దర్యాప్తు చేయాలని సెక్షన్ 29 స్పష్టం చేస్తోంది. మరి ఎందుకు అలా చేయలేదు?
» ఈ కుంభకోణంలో పాత్రధారులైన 61 మంది ఏజెంట్లను గుర్తించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇందులో 39 మందిని మాత్రమే నిందితులుగా చేర్చి, మిగిలిన వారిని ఎందుకు సాక్షులుగా పేర్కొన్నారు ? అద్విక ట్రేడింగ్ కంపెనీ యజమానులు అందర్నీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు? ఈ ప్రశ్నలకు పోలీసు అధికారులు వివరణ ఇవ్వనే లేదు.
» సేకరించిన అక్రమ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మరి ఆ బ్యాంకు ఖాతా తెరిచేందుకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఉంటే విలేకరుల సమావేశంలో ఇదిగో న్యాయస్థానం అనుమతి అని ఎందుకు చూపించలేదు?
» అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని వసూలు చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఏజెంట్లు ఎలా ఇచ్చారో వెల్లడించలేదు. అద్విక మేనేజ్మెంట్, ఏజెంట్ల కొన్ని ఆస్తులను విక్రయించేలా చేసి ఆ నిధులు ఇచి్చనట్టు తెలుస్తోంది. మరి ఆ ఆస్తులను ఎవరు కొనుగోలు చేశారో ఎందుకు వెల్లడించలేదు? ఆ ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఆ ఆస్తులను బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా.. లేక పోలీసు అధికారుల బినామీలకే తక్కువ ధరకు విక్రయించారా? ఈ విషయంలో విజయవాడ పోలీసులు ఎందుకు పారదర్శకంగా వివరాలు వెల్లడించలేదు?
» ఈ కేసులో ఇద్దరు కీలక అధికారుల మధ్య విభేదాలతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చిందని పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆస్తుల విక్రయాలు పర్యవేక్షించిన ఓ అధికారి, బంగారం రికవరీ పర్యవేక్షించిన మరో అధికారి మధ్య ఆధిపత్యపోరు వాస్తవం కాదా? అసలు ఎంత బంగారం రికవరీ చేశారు? ఎంత బంగారం చూపించారు? ఆ వివరాలను ఏజెంట్లుగానీ పోలీసు అధికారులుగానీ ఎందుకు వెల్లడించలేదు? ఈ సందేహాలను నివృత్తి చేస్తేనే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నారని నమ్మకం కలుగుతుందని బాధితులు స్పష్టం చేస్తున్నారు.
పోలీసులు ఒరిజినల్ పత్రాలు తీసుకున్నారు
అద్విక ట్రేడింగ్ కంపెనీలో నేను దశల వారీగా రూ.23 లక్షలు డిపాజిట్ చేశాను. కానీ మోసపోయానని గుర్తించిన తర్వాత విజయవాడ పోలీసులను కలిశాను. నా వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు చూపించాను. ఆ ఒరిజినల్ పత్రాలను ఓ పోలీసు అధికారి తీసుకున్నారు. న్యాయం చేస్తానన్నారు. కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. నా నుంచి ఒరిజినల్ పత్రాలు తీసుకున్న అధికారి ఇప్పుడు స్పందించడమే లేదు. – శ్రీధర్, బాధితుడు


