కర్నూలు: కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి మండిపడ్డారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న ‘‘సుగాలి ప్రీతికి న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర’’కు అన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమను పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
‘‘టీడీపీ ప్రభుత్వ పాలనలో కూతురిని కోల్పోయాను. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆపుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మాకు లేదు. మా కూతురు కోసం పోరాటం చేస్తున్నాను. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలం రాస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నారా లోకేశ్ యువగళం, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేశారు. అయితే తాను వీల్ చైర్ యాత్ర చేస్తే తప్పు ఏమిటి?
యాత్రను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పోలీసులతో అర్ధరాత్రి సమయంలో మాపై వేధింపులకు పాల్పడింది. ప్రీతికి న్యాయం చేస్తామని ర్యాలీ చేసి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. నిందితులకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. నిందితులకు శిక్ష పడే విధంగా నా పోరాటం కొనసాగుతుంది. రేపు ప్రీతి సమాధి నుంచి నా యాత్రను కొనసాగిస్తాను’’ అని తెలిపారు.
కాగా, ఈ నెల 19వ తేదీన న్యాయం కోసం నిర్వహించనున్న ‘‘సుగాలి ప్రీతి వీల్ చైర్ యాత్ర’’కు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పారు. పోలీసుల వేధింపులపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి మండిపడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. యాత్ర చేసి తీరుతానని చెబుతున్నారు.


