కోనసీమ జిల్లా: రాజానగరం మండలంలోని చక్రద్వారబంధంలో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాపేశ్వరానికి చెందిన మట్టపర్తి నాగబాబు (25)కు వేమగిరితోటకు చెందిన కుమారి (21)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.
నాగబాబు చక్రద్వారబంధంలో బీరువాల కంపెనీలో పనిచేస్తూ, గ్రామంలోనే అద్దె ఇంటిలో భార్యతో కలసి నివాసం ఉంటున్నాడు. వీరికి పిల్లలు లేరు. వీరిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కుమారి తన అక్క వివాహం నిమిత్తం భర్తతో కలసి పుట్టింటికి వెళ్లి, ఆదివారం రాత్రి తిరిగి వచ్చింది. కానీ ఉదయం 9 గంటలైనా తలుపులు తీయకపోవడంతో స్థానికులు వచ్చి తలుపు కొట్టగా, నాగబాబు గొంతుపై గాయాలతో వచ్చి తలుపు తీశాడు.
కుమారి మాత్రం విగతజీవిగా పడి ఉంది. స్థానికులు వెంటనే వారిద్దరినీ స్థానిక జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రికి తరలించగా, కుమారి మృతి చెందింది. నాగబాబు మాత్రం కోలుకుంటున్నాడు. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రి ప్రాంతాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన, సీఐ వీరయ్యగౌడ్ పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణం కావొచ్చని భావిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై జీవీవీ సత్యనారాయణ తెలిపారు.


