శోక తప్త హృదయాలతో తండ్రికి అంత్యక్రియలు
కృష్ణాజిల్లా: తమ తండ్రి అంత్యక్రియలు తామే జరుపుకుంటామని ముందుకొచ్చిన కుమార్తెలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పామర్రు గ్రామంలోని అరండాల్ పేటకు చెందిన పలగాని వెంకట నారాయణ(65) గుండె పోటుతో సోమవారం మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మృతుడి అంత్యక్రియలు జరిపేందుకు కుమారుడు లేకపోవడంతో బంధు మిత్రులు ఆందోళన చెందుతుండగా , ఈ విషయాన్ని గ్రహించిన మృతుడి కుమార్తెలు ముందుకొచ్చి తమ తండ్రి అంత్యక్రియలు తామే నిర్వహించి తమ తండ్రి రుణం తీర్చుకుంటామని ముందుకు రావడం పలువురిని ఆశ్చర్యపర్చింది. మృతుడి ఇద్దరు కుమార్తెలైన లత, ప్రసన్న తండ్రి పాడెను మోశారు.
పెద్ద కుమార్తె జ్యోతి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించింది. తండ్రి పాడెను పట్టే సందర్భంలో తమ తండ్రిని ఇక చూడలేమని తలచి బాధా తప్త హృదయాలలో నడుస్తూ శ్మశాన వాటికకు వెళ్లడంతో పలువురి కళ్లు చెమ్మగిల్లాయి. స్థానిక హిందూ శ్మశాన వాటిలో అంత్య క్రియలను పూర్తిచేశారు.


