అత్యవసర సేవలూ బహిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం
రోగుల అవస్థలు వర్ణనాతీతం
స్టైపెండ్ పెంచబోమంటూ బాబు సర్కారు మొండి వైఖరి
సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మెతో రాష్ట్రంలో వైద్యం స్తంభించింది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలనూ జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. సమ్మెను తీవ్రతరం చేశారు. దీంతో అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ ఓపీ, ఐపీ, సర్జరీలతోపాటు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూల్లోనూ రోగుల నాడి పట్టే వారు కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం స్టైపెండ్ పెంపులో అన్యాయం చేస్తోందని ఈ నెల 10 నుంచి జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
జూడాల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాల్లో జూడాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరసనలు చేపట్టారు. ఉయ్ వాంట్ జస్టిస్ నినాదాలతో ఆస్పత్రులు, కళాశాలలను హోరెత్తించారు. న్యాయమైన స్టైపెండ్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు.
సర్జరీలు వాయిదా
గడిచిన వారం రోజులుగా జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు బోధనాస్పత్రుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆపరేషన్ థియేటర్(ఓటీ) సేవలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జూడాలంతా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలను వారం, 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. కేవలం అత్యవసరమైతేనే సర్జరీలు చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు.
గుంటూరు, విశాఖ, కర్నూలు, విజయవాడ వంటి చోట్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉండే జీజీహెచ్లలో వైద్యులు అందుబాటులో లేరని, ఓపీ సేవల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ రోజుల్లో అడ్మిషన్లు 3,000 వరకు నమోదవుతుండగా, సోమవారం సమ్మె వల్ల సగానికిపైగా పడిపోయినట్టు సమాచారం. అలాగే ఓపీ సేవలు 20 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది.
స్టైపెండ్ పెంచలేం
జూడాలు సమ్మె తీవ్రతరం చేసిన నేపథ్యంలో స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో జూడాలు డిమాండ్ చేస్తున్నట్టుగా స్టైపెండ్ పెంపు కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆనవాయితీగా వస్తున్న 15 శాతం పెంపును కొనసాగిస్తే రూ.87.91 కోట్ల భారం పడుతుందని, అంత పెంచడానికి సుముఖంగా లేమని కుండ బద్దలు కొట్టేసింది. పెరిగిన జీవన వ్యయం, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుని స్టైఫండ్ 30 శాతం పెంచాలని ఏపీ జూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే తమిళనాడు తరహాలో ఏటా 3 శాతం పెంపు విధానం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆనవాయితీగా వస్తున్న పెంపునకు బాబు సర్కారు గండి కొట్టడంతో జూడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


