ఆయన పర్యటనను విజయవంతం చేయండి
వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్
బుట్టాయగూడెం (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు మద్దతుగా ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారని.. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ.. రైతులు కేజీకి రూ.300 పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే ఆ పంటలను నేడు రూ.170 నుంచి రూ.190 వరకూ అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు.
వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన సీఎం చంద్రబాబు.. వరికి యూరియా వేస్తే కేన్సర్ వస్తుందని, మామిడికాయ తింటే షుగర్ వస్తుందని, సిగరెట్లు తాగితే కేన్సర్ వస్తుందని, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందని చెబుతూ రైతులను నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. ఏ పంట కూడా ఆరోగ్యకరం కాదంటే రైతులు ఎలా బతకాలని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన పొగాకు రైతుల గర్జన ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి నాందిగా నిలిచిందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా రైతులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పరిశీలకులు పాల్గొన్నారు.


