ఒకప్పుడు నేను.. ఇప్పుడు నా బిడ్డ కూడా! | Visakhapatnam Murder Case, Shruti’s Emotional Struggle After Bolishetty Suresh Arrest Leaves Family In Crisis | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు నేను.. ఇప్పుడు నా బిడ్డ కూడా!

Aug 1 2026 9:47 AM | Updated on Aug 1 2026 10:46 AM

Bolishetty Suresh Wife Shruti Emotional

విశాఖపట్నం: భర్త జైలులో.. ఒడిలో ఐదు నెలల పసికందు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒకప్పుడు అనాథగా పెరిగిన శృతి.. ఇప్పుడు తన బిడ్డ కూడా అదే అనాథ జీవితాన్ని అనుభవించాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమైంది. విశాఖలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలిక హత్య కేసులో అరెస్టయిన బొలిశెట్టి సురేష్‌ భార్య శృతి ఊర్వశీ జంక్షన్‌లో ఉన్న ఇంట్లో బోరున విలపిస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది.  

ప్రేమతో మొదలై.. విషాదంతో మిగిలింది 
హాస్టల్‌లో పెరిగిన శృతి ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా సురేష్‌ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, జీవితాంతం తోడుంటానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో సంతోషం కంటే కన్నీళ్లే ఎక్కువయ్యాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమార్తెను కోల్పోయింది. గర్భంలో ఉన్న కవలల్లో ఒక శిశువు కూడా మృతిచెందింది. ఇప్పుడు ఒడిలో ఉన్న ఐదు నెలల పసికందే తనకు మిగిలిన ఆశగా నిలిచింది. 

పాలకు డబ్బులు లేక.. 
మైనర్‌ బాలికను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఒడిశాకు తీసుకెళ్లి, అక్కడ పడేసి వచ్చిన భర్త సురేష్‌ జైలుకెళ్లడంతో కుటుంబానికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం మూసుకుపోయింది. నెలకు రూ.3,500 అద్దె చెల్లిస్తూ గౌరీనగర్‌లో ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని చెబుతున్నారని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు సెరెలాక్‌ కొనుగోలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఒకప్పుడు నేనే అనాథను. ఇప్పుడు నాతో పాటు నా ఐదు నెలల బిడ్డ కూడా అనాథ అయింది. 

మా బిడ్డ ఏ పాపం చేసింది?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది. ఒక వ్యక్తి చేసిన నేరానికి చట్టం శిక్ష విధిస్తుంది. కానీ ఆ నేరం వల్ల ఛిద్రమైన కుటుంబాలు, దిక్కులేని చిన్నారులు అనుభవించే బాధకు మాత్రం కొలమానం ఉండదు. ఈ కేసులోనూ నిందితుడి చర్యతో అమాయక పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement