అబుజా (నైజీరియా): ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమైన దేశ ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో తిరుగుబాటుదారులు, నైజీరియా భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందారని అధికారులు మంగళవారం వెల్లడించారు.
సోమవారం కెబ్బీ రాష్ట్రంలోని సకాబా కౌన్సిల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు, 17 మంది తిరుగుబాటుదారులు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి బషీర్ ఉస్మాన్ ప్రకటనలో తెలిపారు. అంటే మొత్తం కలిపి 29 మంది మృతి చెందారు. తిరుగుబాటుదారులు మోటార్సైకిళ్లపై ప్రయాణిస్తూ, భారీ ఆయుధాలతో ఉన్న సమయంలో భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయని ఉస్మాన్ తెలిపారు. నైజీరియా పట్టణాలు, గ్రామాలపై తరచూ దాడులు చేసే సాయుధ ముఠాలు ఎక్కువగా ఉన్న జంఫారా రాష్ట్ర సరిహద్దు సమీపంలో వారు కనిపించారని చెప్పారు.
“దురదృష్టవశాత్తు ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది పోలీసు సిబ్బందిని కోల్పోయాం. ఇద్దరు గాయపడ్డారు. వారికి వైద్య చికిత్స అందుతోంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు.
తిరుగుబాటుదారులు నైజీరియా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో చురుకుగా ఉన్న సాయుధ ముఠాలకు చెందినవారు. వీరిని స్థానికంగా "బాండిట్స్" అని పిలుస్తారు. తిరుగుబాటు, హింసకు పేదరికం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉండటం, జాతి, భూవివాదాలు తీవ్రరూపం దాల్చడం, పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు పెరగడం వంటివి కారణాలు.
ఆయుధాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది నేర ముఠాలు గ్రామాలపై దాడులు చేసి డబ్బు వసూలు చేయడం, అపహరణలకు పాల్పడుతున్నారు. జంఫారా, కెబ్బీ, సోకోటో, కత్సీనా రాష్ట్రాల్లో ఇలాంటి సాయుధ గుంపులు తరచూ భద్రతా బలగాలపై, గ్రామాలపై దాడులు చేస్తుంటాయి.


