అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.
ఎవరిపై భారం పడనుంది?
ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?
అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.
అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!
OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.
తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.
ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణం
అమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?
$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది.


