ఒక్కసారిగా వేల మంది.. వలసల తుపానుతో షాక్‌లో స్పెయిన్‌ | Thousands Storm Ceuta Border: Spain in Shock Video Viral | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా వేల మంది.. వలసల తుపానుతో షాక్‌లో స్పెయిన్‌

Jul 31 2026 7:09 AM | Updated on Jul 31 2026 7:12 AM

Thousands Storm Ceuta Border: Spain in Shock Video Viral

స్పెయిన్‌–మొరాకో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా నుంచి యూరప్‌లోకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారులు గురువారం స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సియుటా (Ceuta) లోకి ఒక్కసారిగా ప్రవేశించారు. దీంతో సరిహద్దు వద్ద పరిస్థితి అదుపుతప్పిందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

మొరాకోలోని టరాజల్‌ బీచ్‌ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సముద్రపు బ్రేక్‌వాటర్లను దాటి సియుటాలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది యువకులు ఉన్నప్పటికీ.. మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. స్పెయిన్‌ భూభాగంలోకి చేరుకున్న కొందరు వలసదారులు ఆనందంతో ‘‘వివా ఎస్పానా’’(స్పెయిన్‌కు జయహో) అంటూ నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో వలసదారులు సరిహద్దు దాటడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

సియుటా సివిల్‌ గార్డ్‌ ఆఫీసర్స్‌ చీఫ్‌ రాచిడ్‌ స్బిహి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ఎంతమంది సరిహద్దు దాటారో ఖచ్చితంగా చెప్పలేం కానీ వేల సంఖ్యలో ప్రజలు లోపలికి వచ్చారు. సరిహద్దు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది’’ అని తెలిపారు.

సైన్యాన్ని దించాలని డిమాండ్‌
సియుటా ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్‌ జీసస్‌ వివాస్‌.. తాజా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల రక్షణ, పౌరుల భద్రత కోసం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని స్పెయిన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు వద్ద అదనపు పోలీసు బలగాలతో పాటు సైన్యాన్ని కూడా మోహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘సరిహద్దు భద్రతను కాపాడేందుకు, ప్రజల రక్షణకు మరిన్ని బలగాలు అవసరం’’ అని పేర్కొన్నారు.

అయితే వలసల ప్రవాహాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించే అవకాశం లేదని స్పెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని వేగంగా అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

మొరాకోతో సమన్వయం
సరిహద్దు పరిస్థితులను నియంత్రించేందుకు మొరాకో అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పెయిన్‌ ప్రభుత్వం వెల్లడించింది. అక్రమంగా సియుటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా తిరిగి పంపించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపింది. స్పెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లాస్కా శుక్రవారం సియుటాకు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు.

పెరుగుతున్న వలసల ప్రవాహం
సియుటాలోకి వలసదారుల రాక గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం సముద్ర మార్గంలో సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నించిన వారిలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజుల్లోనే 1,500 మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారని, అక్కడి ఆశ్రయ కేంద్రాలు ఇప్పటికే నిండిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

స్పెయిన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 15 వరకు దాదాపు 3 వేల మంది వలసదారులు భూమి లేదా సముద్ర మార్గాల ద్వారా సియుటాకు చేరుకున్నారు.

2021 సంక్షోభం మళ్లీ గుర్తుకు!
తాజా పరిణామాలు 2021 మేలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మొరాకో సరిహద్దు నియంత్రణలను సడలించిందనే ఆరోపణలు వచ్చాయి. స్పెయిన్‌లో చికిత్స పొందిన వెస్ట్రన్‌ సహారా వేర్పాటువాద నేత బ్రాహిం ఘాలీ వ్యవహారం కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.

యూరప్‌ ప్రవేశానికి కీలక ద్వారం
ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న సియుటా.. చారిత్రకంగా స్పెయిన్‌ ఆధీనంలోని ప్రాంతం. మెరుగైన జీవితం కోసం ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి వచ్చే వలసదారులకు ఇది యూరప్‌లోకి ప్రవేశించే కీలక మార్గంగా మారింది. మొరాకోలోని ఫ్నిడెక్‌ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ పలువురు సియుటాకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు సరిహద్దు కంచెలను దాటేందుకు ప్రయత్నిస్తారు.

తాజా భారీ వలసలతో సియుటా సరిహద్దులో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. స్పెయిన్‌ ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement