భారత విజ్ఞానం
మహాభారతంలో సంజయుడు సకల సద్గుణ సంపన్నుడు. ఇంద్రియాలను జయించినవాడు కాబట్టే సంజయుడు... అనే పేరు వచ్చింది. గవల్గణుడు అనే రధ చోదకుని కుమారుడు. ముఖ్యంగా కౌరవ సామ్రాజ్యాధిపతి ధృతరాష్ట్రునికి ముఖ్య సలహాదారుడు కూడా. కురుక్షేత్ర యుద్ధానంతరం బతికున్న వాళ్ళలో సంజయుడు కూడా ఒకరు.
పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుని తరఫున రాయబారిగా వెళ్లిన వాడు. కానీ యుద్ధం అనివార్యం కావడంతో కురుక్షేత్ర సంగ్రామం లో జరుగుతున్న యుద్ధ తీరుతెన్నులను, తనకు వ్యాసుడు ప్రసాదించిన దివ్యదృష్టితో ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తాడు. యుద్ధంలో కుమారులను కోల్పోయిన ధృతరాష్ట్ర గాంధారిల వెంట అడవికి వెళ్లి అక్కడ కూడా వారి ఆలనా పాలన చూశాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని ధృతరాష్ట్రుని కళ్ళకు కట్టినట్లు సంజయుడు వివరిస్తాడు. (సంజయ ఉవాచ అని గీతలో ఉండటం మనకు తెలిసిందే) కౌరవులు అధర్మమార్గంలో పయనిస్తున్నారని, వినాశనం తప్పదని చెప్పగలిగిన ధైర్యశాలి, సద్గుణ సంపన్నుడు సంజయుడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా, ధర్మం తప్పకుండా, అసత్యం పలకకుండా ఉండే నేర్పరితనంలో సంజయుడి సొంతం.
అందువల్లే ధృతరాష్ట్రుడు సంజయుడిని, పాండవుల వద్దకు రాయబారిగా పంపాడు. కురుపాండవుల బలాబలాలు క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టే తన బుద్ధి కుశలత ఉపయోగించినా, సంజయ రాయబారం ఫలించలేదు. అనంతరం సంజయుడు ధృతరాష్ట్రునితో శ్రీ కృష్ణుడు ధర్మసంస్థాపనకు అవతరించినవాడు, ధర్మనందనులైన పాండవుల విజయానికి కారకుడు అవుతాడన్న విషయాన్ని నిష్కర్షగా చెప్పగలిగాడు.
ఇంతటి విచక్షణాజ్ఞానం ఉండడం వల్లే వేదవ్యాసుడు కురుక్షేత్ర రణరంగంలో జరిగే పరిణామాలను నేరుగా చూడగలిగే నైపుణ్యాన్ని సంజయుడికి ప్రసాదించాడు. ఒకపక్క యుద్ధ రీతిని పరిశీలిస్తూ, మరోపక్క ధృతరాష్ట్రునికి యుద్ధం జరిగే తీరును వివరిస్తాడు. సంజయుడు చేసిన హితోక్తులను మనం తప్పక ఆచరించాలి. నిజం మాట్లాడటం ఎలా... అధర్మం నుండి తప్పుకోవడం ఎలాగో తెలుసుకోవచ్చు.
– సి. ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


