యుయుత్సుడు... కౌరవులలో శ్రేష్ఠుడు | Yuyutsu is A Tale of Honor in the Mahabharatam | Sakshi
Sakshi News home page

యుయుత్సుడు... కౌరవులలో శ్రేష్ఠుడు

Jul 27 2026 6:11 AM | Updated on Jul 27 2026 6:11 AM

Yuyutsu is A Tale of Honor in the Mahabharatam

భారత విజ్ఞానం

మహాభారతంలో కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడితో కలిపి 100 మంది గురించి చెప్తాము. మిగిలిన 98 పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. వారిలో యుయుత్సుడు కూడా ఒకడు. ఇతనిని కౌరవులలో శ్రేష్టుడిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహాభారత యుద్ధానంతరం కౌరవులలో బతికిన ఒకే ఒక్కడు కూడా యుయుత్సుడే.

యుయుత్సుని జననం, ధర్మనిరతి
ధృతరాష్ట్రుని పట్టమహిషి గాంధారి గర్భం దాల్చి రెండు ఏళ్లు గడిచినా సంతానం కలగపోవడంతో గాంధారి చెలికత్తె అయిన వైశ్యకన్య సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడిగా పొందాడు ధృతరాష్ట్ర్రుడు.

యుయుత్సుడు కౌరవులలో ఒకడైనప్పటికీ ధర్మనిరతుడు... మహావీరుడు... అతిరథులలో ఒకడు. ఆది నుండి ధర్మం వైపే నిలబడ్డాడు. అలనాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక్క యుయుత్సుడే వ్యతిరేకించాడు. భీముడిని విషపు నీటి ప్రయోగం నుండి కాపాడాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు సహాయం చేశాడు.

కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం కావడంతో యుద్ధం ప్రారంభం కాకమునుపే, ధర్మరాజు మాట్లాడుతూ యుద్ధంలో అస్త్ర శస్త్రాలు చేపట్టింది, ధర్మాన్ని రక్షించడానికి... ధర్మం వైపు నిలబడి పోరాడాలనుకునే వారికి  స్వాగతం... అని  చెప్పడంతో, ధర్మం పాండవుల వైపే ఉందని యుయుత్సుడు గ్రహించి కౌరవుడైనప్పటికీ పాండవుల పక్షాన చేరి కౌరవులపై యుద్ధం సాగించాడు.

కౌరవులలో మిగిలిన ఒకే ఒక్కడైన యుయుత్సుని కౌరవ సామ్రాజ్యానికి రాజును చేస్తామని, దీనివల్ల ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలుగుతుందని ధర్మరాజు ప్రకటించడంతో అప్పటి ధర్మవేత్తలు అడ్డుపడి, అభ్యంతరం చెబుతూ క్షత్రియ సంతానానికి చెందని యుయుత్సుడు రాజు కావడానికి అనర్హుడని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ధర్మరాజు యుయుత్సుని పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించి అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్‌ సంరక్షణ బాధ్యతను కూడా యుయుత్సునికే అప్పగించాడు. అనంతరం పాండవులు స్వర్గం వైపు పయనమయ్యారు.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement