భారత విజ్ఞానం
మహాభారతంలో ఘటోత్కచుడు పాండవులలో ఎంతో బలశాలి అయిన భీముడు, రాక్షస మూలాలు కలిగిన హిడింబిల కొడుకు. ఘటోత్కచుడి గురించి సామాన్య ప్రజలకు తెలియాలంటే అలనాటి మాయాబజార్, ఘటోత్కచ సినిమాల్లో ఎంతో రక్తికట్టించే విధంగా అతని పాత్రను మలిచారు. ఘటోత్కచుడు చేసిన ఏ త్యాగం వల్ల ఏ విధమైన లాభం పాండవులకు దోహదపడిందో తెలుసుకుందాం....
ముందుగా ఘటోత్కచునికి ఆ పేరు ఎలా వచ్చిందంటే... ఘటోత్కచుని తల బోర్లించిన ‘ఘట‘ (కుండ)‘ఉత్కచం’(బట్టతల) ఆకారంలో నున్నగా ఉండడంతో అతనికి ఘటోత్కచుడు అనే పేరు సార్థకమైనదని చెప్పుకోవచ్చు. ఘటోత్కచుడు పాండవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొని స్వతహాగా తనకున్న ఇంద్ర, మహేంద్రజాల, టక్కు, టమార విద్యలను ప్రదర్శించాడు.
సరిగ్గా 14వ రోజు నాటి మహాభారత యుద్ధంలో తన కుమారుడైన అంజనపర్వుడు, అశ్వత్థామ చేతిలో చనిపోవడంతో ఘటోత్కచుడు ఎంతో ఆగ్రహం చెందాడు. తన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నిటిని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేశాడు. ఒకదశలో ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి యోధులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదిలా ఉండగా జయద్రథుడు మరణానంతరం, సూర్యాస్తమయం దాటి చీకటి పడినా యుద్ధం సాగుతుండగా స్వతహాగా ఉన్న తన శక్తితోపాటు రాక్షసశక్తి తోడవడంతో యుద్ధంలో తీవ్రంగా విజృంభిస్తూ అలాయుధ, అలంబసులను సంహరించాడు.
సమయం ఇంకా గడుస్తున్న కొద్దీ ఘటోత్కచుని శక్తి, భీకర దాడులు పెరిగిపోతుండటంతో, అతనిని అదుపు చేసేందుకు, కర్ణునివద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన ‘వాసవీ’ అస్త్రాన్ని ప్రయోగించమని దుర్యోధనుడు కోరతాడు. వాసవీ అస్త్రం ఇంద్ర ప్రసాదితమని, ఎంతో శక్తిమంతమైనదని, కేవలం అర్జునునిపై ప్రయోగించేందుకు దాచానని, చెప్పినప్పటికీ దుర్యోధనుడు పదేపదే కోరడంతో విధిలేని పరిస్థితులలో కర్ణుడు తన వద్ద ఉన్న లక్ష్య¿ే దితమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించడంతో కుప్పకూలాడు. ఆ విధంగా అర్జునుని కోసం దాచుకున్న వాసవీ అస్త్రం ఘటోత్కచునిపై ప్రయోగింపబడటంతో, పరోక్షంగా పాండవులకు మేలు కలిగింది.
– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


