కుంచె పట్టి..ఆ గ్రామాన్ని రక్షించిన ఒకేఒక్కడు..! | Huang Yung-Fu: Former soldier save Taiwan's rainbow village from demolition | Sakshi
Sakshi News home page

ఆ గ్రామం కనుమరుగ్వకుండా పోరాడిన ఒకేఒక్కడు..! ఇవాళ ప్రపంచమే..

Jul 26 2026 1:42 PM | Updated on Jul 26 2026 2:49 PM

Huang Yung-Fu: Former soldier save Taiwan's rainbow village from demolition

ఒక్కడిగా పోరాడితే ఫలితం ఏం ఉంటుంది అనిపిస్తుంది. ఓ పదిమంది కలిసి ఐక్యంగా చేస్తేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం. కానీ అవన్ని కరెక్ట్‌ కాదని నిరూపించాడు ఈ తాత. అంతేగాదు మనసుపెట్టి..పోరాడితే ఒక్కడే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు. యావత్తు ప్రపంచం తలెత్తి తనవైపు చూసేలా చేశాడు. అది కూడా కేవలం కాలక్షేపం కోసం చేసిన కళతోనే ఈ ఘనత సృష్టించడం విశేషం. పైగా సృజనాత్మకత గొప్పతనం, కళతో ఏం చేయొచ్చో.. కనవిప్పు కలిగించాడు. ఇంతకీ ఆ తాత ఏం చేశాడంటే..

తైవాన్‌లోని తైచుంగ్‌లో శిథిలావస్థలో ఒక సైనిక స్థావరం ఉంది. అక్కడ హువాంగ్ యుంగ్-ఫు అనే మాజీ అధికారి ఒక్కే నివాసం ఉంటున్నాడు. అతడి కారణంగా ఆగ్రామం ఉనికి నిలిచింది, యావత్తు ప్రపంచానికి తెలిసింది. ఆ తాత అసాధారణ కథ వింటే విస్తుపోవడం ఖాయం. 

అద్భుత పాఠాన్ని నేర్పించిన తాత..
ఆ గ్రామాన్ని 1940 చివరలో నిర్మించారు. దీన్ని చైనా అంతర్యుద్ధం తర్వాత తైవాన్‌కు తరలివచ్చిన కువోమింటాంగ్ (జాతీయవాద సైన్యం) సైనికులకు తాత్కాలిక నివాసంగా ఇచ్చారు. ఈ నివాస ప్రాంతంలో సుమారు 1,200 ఇళ్లు ఉండేవి. వాటిల్లో వేలాది కుటుంబాలు ఉండేవి. అయితే, దశాబ్దాలు గడిచేకొద్దీ, యువ తరాలు వలస వెళ్లిపోయాయి, భవనాలు శిథిలమయ్యాయి. దాంతో డెవలపర్లు పునరాభివృద్ధి కోసం ఆ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. 2000వ దశాబ్దం చివరి నాటికి, దాదాపు ప్రతి నివాసి వెళ్లిపోయారు, కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

దాంతో దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న హువాంగ్ యుంగ్-ఫు, తైవాన్‌లో తనకు తెలిసిన ఏకైక ఇంటిని విడిచి వెళ్లడానికి నిరాకరించాడు. నిజానికి అతడొక్కడే మిగిలాడు అక్కడ. ఒంటరిగా ఏం పాలుపోక.. 86 ఏళ్ల వయసులో ఒక పెయింట్ బ్రష్ తీసుకుని తన ఇంటి లోపల గోడపై ఒక చిన్న పక్షి చిత్రాన్ని గీశాడు. ఆ ఒక్క చిత్రం త్వరలోనే గ్రామం అంతటా గోడలు, కాలిబాటలు, తలుపులు, కిటికీలను కప్పివేసేలా వేలాది రంగురంగుల కుడ్యచిత్రాలుగా విస్తరించింది.

నిజానికి ఆయన చిత్ర కళాకారుడు కాదు. తన రోజులని చక్కగా గడిచిపోయేలా కాలక్షేపం కోసం చేసి పని మంచి ఉద్దేశ్యాన్నిచ్చే అభిరుచిగా మారిందని అన్నారు. ఆయన విలక్షణమైన శైలి, ప్రకాశవంతమైన రంగులు, బాల్యపు ఊహశక్తితో గీసిన చిత్రాలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని రంగులుమయంగా చేశాయి. 

ఆ కళే గ్రామానికి రక్షగా..
సమీప విశ్వవిద్యాలయాల విద్యార్థులు  ప్రొఫెసర్లు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు హువాంగ్ చిత్రాలను చూసి ఆకర్షితులవుతారు. అలా శిథిలావస్థలో ఉన్న ఆ సైనిక స్థావరం సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి..ఆ గ్రామాన్ని కూల్చివేయకుండా పరిరక్షించాలని తైచుంగ్ నగర ప్రభుత్వాన్ని కోరుతూ వారు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించడంతో, చివరికి అధికారులే పునరాభివృద్ధి ప్రణాళికలను విరమించుకున్నారు.

అలా సైనిక విలేజ్‌ కాస్త రెయిన్‌బో విలేజ్‌గా సాంస్కతిక ఆకర్షణగా పరిరక్షించబడింది. అంతేగాదు హువాంగ్‌కి రెయిన్‌బో తాతగా పేరొచ్చింది కూడా. దీనివల్ల హువాంగ్ తన ఇంట్లోనే ఉండగలిగాడు, అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వచ్చి అతని కళాఖండాలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేగాదు అక్కడి తైవాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం, హువాంగ్ చిత్రాలు ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన ఆ ప్రదేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఒకప్పుడు కనుమరుగవడానికి సిద్ధంగా ఉన్న ఒకగ్రామానికి అవి కొత్త జీవం పోశాయి. 

ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తు హువాంగ్ యుంగ్-ఫు 2024 జనవరిలో తన 100వ ఏట కన్నుమూశారు. ఆయన వెళ్తూ.. వెళ్తూ..రెయిన్‌బో విలేజ్‌లోని రంగురంగుల గోడల కన్నా ఎంతో విశాలమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఈ తాత హువాంగ్‌ కథ కళ కేవలం అందాన్ని ఇవ్వడానికే కాకుండా, భద్రపరచడానికి,ప్రజలను అనుసంధానించడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగ పడుతుందని నిరూపించింది. అంతేగాదు నిరసనలు, రాజకీయాలు సాధించలేని దానిని సృజనాత్మకత కొన్నిసార్లు సాధించగలదని హువాంగ్ యుంగ్-ఫు కథ నిరూపించింది కదూ..!.

 

(చదవండి: టీసీఎస్‌ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్‌ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..)

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement