తైవాన్ ‘సీక్రెట్’ వెబ్‌సైట్‌తో చైనాకు దడ! | Spy Platform Sparks Furious Threat of Countermeasures from China | Sakshi
Sakshi News home page

తైవాన్ ‘సీక్రెట్’ వెబ్‌సైట్‌తో చైనాకు దడ!

Jun 17 2026 11:21 AM | Updated on Jun 17 2026 1:04 PM

Spy Platform Sparks Furious Threat of Countermeasures from China

బీజింగ్‌: చైనా, తైవాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. చైనా పౌరుల నుంచి ఆ దేశ అంతర్గత రహస్యాలు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు తైవాన్ ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ వ్యూహాత్మక చర్యపై బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, దీనికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని చైనా హెచ్చరించింది. ఈ పరిణామంతో తైవాన్ జలసంధి ప్రాంతంలో సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

రహస్యాల సేకరణకు ‘డిజిటల్’ వ్యూహం
తైవాన్‌కు చెందిన నేషనల్ సెక్యూరిటీ బ్యూరో (ఎన్‌ఎస్‌బీ) ఆదివారం ఈ నూతన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించింది. చైనాలో ఉంటూ ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే పౌరులు ఎవరైనా, బీజింగ్ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమతో పంచుకోవచ్చని తైవాన్ ఇందులో పేర్కొంది. దీని కోసం ఒక నిమిషం నిడివి గల ఏఐ ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేసింది. చైనా రాజకీయ వ్యవస్థలో ఉన్న భయాందోళనలు, అభద్రతాభావాలను ఎత్తిచూపేలా ఈ వీడియోను రూపొందించారు. చైనా గూఢచర్య చర్యలను, సైబర్ దాడులను తిప్పికొట్టడానికే ఈ సురక్షితమైన ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు తైవాన్ సమర్థించుకుంది.

చట్టపరమైన చర్యలు తప్పవన్న బీజింగ్
ఈ ఉదంతంపై చైనా తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి చెన్ బిన్హువా తీవ్రంగా స్పందించారు. తైవాన్ అధికార పక్షమైన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)ఉద్దేశపూర్వకంగానే సంబంధాలను చెడగొడుతోందని ఆరోపించారు. తైవాన్ ఏజెన్సీలకు సమాచారం అందించే చైనా పౌరులు, సంస్థలు ఎవరైనా సరే చైనా జాతీయ భద్రతా చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశ భద్రతను కాపాడటం ప్రతి చైనా పౌరుడి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.

పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు
ఈ రాజకీయ వివాదం ఇలా ఉంటే, తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక కదలికలు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం తైవాన్ ద్వీపం చుట్టుపక్కల ఆరు చైనా యుద్ధనౌకలు సంచరిస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించి, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. మరోవైపు చైనా ఒత్తిడిని తట్టుకునేందుకు తైవాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తైవాన్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కాహ్‌సియుంగ్ పోర్ట్ నుండి తొమ్మిదోసారి జలంతర్గామి నావిగేషన్ పరీక్షల కోసం సముద్రంలోకి వెళ్లింది. రెండు దేశాల మధ్య ఈ ప్రచ్ఛన్నయుద్ధం ఆసియా ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి: నిప్పును రాజేసింది అప్పుడే.. షాకిస్తున్న ఆవిష్కరణ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement