సీఎంసీ లోగోకు పోటీల ఆహ్వానం
ప్రథమ బహుమతిగా రూ.20 వేలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారిక లోగో రూపకల్పనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) సహకారంతో ప్రత్యేక డిజైన్ పోటీ ప్రకటించింది. విద్యార్థులు, ఆర్కిటెక్ట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, సృజనాత్మక రంగ నిపుణులు పాల్గొనవచ్చని తెలిపింది. ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10 వేలు అందజేయనున్నారు.
ఎంట్రీల సమర్పణకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 10న విజేతలను ప్రకటిస్తారు. ఎంపికైన లోగోను స్వాతంత్య్ర దినోత్సనాన ఆవిష్కరించనున్నారు. ఆసక్తి ఉన్నవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో ఎంట్రీలు సమర్పించాలి. సైబరాబాద్కు శాశ్వత గుర్తుగా నిలిచే లోగో రూపకల్పనలో భాగం కావడానికి ఇదో అరుదైన అవకాశమని కమిషనర్ సృజన పేర్కొన్నారు. సుపరిపాలన, సుస్థిర, అభివృద్ధి చెందుతున్న నగర దృక్పథాన్ని ఆవిష్కరించాలని సూచించారు.
లోగో పూర్తిగా ఒరిజినల్ సృష్టి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ, ఈపీఎస్ లేదా ఎస్వీజీ వెక్టర్ ఫార్మాట్లో రూపొందించిన డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, అధిక నాణ్యత గల పీఎన్జీ లేదా జేపీఈజీ ఫైల్తో పాటు, గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న భావనను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఒక ఎంట్రీ మాత్రమే. కాపీరైట్ ఉల్లంఘన లేదా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నకలు చేసిన డిజైన్లను పరిగణనలోకి తీసుకోరు. డిజిటల్, ప్రింట్ వినియోగానికి అనువుగా ఉండేవాటినే పరిశీలిస్తారు.


