భారత విజ్ఞానం
ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవ, పాండవులు ఉపయోగించిన అస్త్రాలు ఎలాంటివి? ఎంత శక్తిమంతమైనవి ?... నేటి ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణుల కంటే గొప్పవా?...? అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆనాడే ఉందా... అంటే....ఉందనే చెప్పాలి... నాటి ఆయుధాలు రష్యా, ఉక్రై యిన్, అమెరికా, ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్దాల మధ్య వినియోగిస్తున్న ఆయుధాల కంటే ఎన్నో వేల రెట్లు శక్తి మంతమైనవని చెప్పుకోవచ్చు.
ఈ అస్త్రాలన్నీ భగవత్ ప్రసాదితమైనవి. అందుకే ఎంతో ఉపాసన, దీక్షలతో పాటు, తగిన మంత్ర, తంత్రాలతో ప్రయోగించాలి. మహాభారత సంగ్రామంలో వినియోగించిన కొన్ని శక్తి మంతమైన అస్త్రాల గురించి తెలుసుకుందాం.....
చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధంగా మహాభారత యుద్దాన్ని చెప్పుకోవచ్చు. కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ యుద్ధంలో, 18 అక్షౌహిణిల సైన్యం అంటే. కౌరవులది 11 అక్షౌహిణిల సైన్యం కాగా పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. ఈ యుద్ధంలో 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గొంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారంటే... భారీ జననష్టం సంభవించడానికి కారణం మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే కారణమనే వాదన కూడా ఉంది.
ఆ నాడు జరిగినది మామూలు యుద్ధం కాదని, అత్యంత ఉత్పాతాలు సృష్టించిందని పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆయా ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18రోజుల్లో 47 లక్షల పైబడి జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదని, సాధారణ ఆయుధాలతో సాధ్యపడే విషయం అంతకంటే కాదని శాస్త్రవేత్తలే అంటున్నారు.
మన ధార్మిక గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హానికరమైన ఆయుధం. నేటి తరంలో, వీటిని పోల్చుకుంటే మిస్సైల్స్ లాంటివి కంటే ఎంతో శక్తిమంతమైనవని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం,బ్రహ్మాండాస్త్రం, సుదర్శన చక్రం, నారాయణాస్త్రం, వజ్రాయుధం, పాశుపతాస్త్రం, శక్తి ఆయుధం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాసవి శక్తి, గాండీవం తదితరాలను చెప్పుకోవచ్చు.మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాలను గురించి ముందు వారాలలో మరింత వివరంగా తెలుసుకుందాం...
– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


