సుదర్శన చక్రం
పాశుపతాస్త్రం
వజ్రాయుధం
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి రెండు వారాలుగా తెలుసుకుంటూ వస్తున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో మరికొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుని అలనాటి అస్త్రాలు శీర్షికకు ముగింపు పలుకుదాం...
సుదర్శన చక్రం...
మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని ఆయుధం సుదర్శన చక్రం. 108 రంపపు పళ్ల ఆకారంలో కొనలు పదునుదేరి, లక్ష్య భేదితమైన సుదర్శన చక్రం పని పూర్తికాగానే, ఎవరైతే ప్రయోగించారో వారివద్దకే చేరుతుంది. మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు తన సుదర్శనచక్రంతో శిశు పాలుని సంహరించాడు.
నారాయణాస్త్రం...
ఈ అస్త్రం విష్ణుమూర్తికి చెందినది. దీనిని ప్రయోగించడం శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు,అశ్వత్థామలకు మాత్రమే తెలుసు. కొన్ని పదుల క్షిపణులు ఒకేసారి ప్రయోగిస్తే ఎంత శక్తిమంతంగా ఉంటుందో నారాయణాస్త్రం కూడా అంత శక్తిమంతంగా ఉంటుంది. దీని బారినుంచి ఎవరూ తప్పించుకోలేరు... ప్రతిఘటించలేరు. ఈ అస్త్రం ప్రయోగించిన సమయంలో ఎవరి వద్ద ఆయుధాలు ఉన్నా వాటిని త్యజించి నారాయణాస్త్రానికి లొంగిపోవాలి.
లేకుంటే తన లక్ష్యసాధనను ఈ అస్త్రం నెరవేర్చి తీరుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అందరు యోధులు ఆయుధాలు త్యజించి లొంగిపోగా ఒక్క భీముడు మాత్రమే ఎదురు తిరిగాడు. అయితే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణపరమాత్మ సూచన మేరకు భీముడు కూడా లొంగిపోయి నారాయణాస్త్రానికి నమస్కరించడంతో కథ సుఖాంతమైంది.
వజ్రాయుధం...
దేవతల రాజయిన ఇంద్రుని ఆయుధం. దీనిని దధీచి మహర్షి వెన్నెముక నుండి తయారు చేసారు. దీనిని ఇంద్రుడు తన కుమారుడైన అర్జునునికి ఇచ్చాడు. ఈ ఆయుధం విశ్వంలో ఉన్న కాంతిని సేకరించుకొని మెరుపులతో దాడి చేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీనిని వృత్తాసురుని సంహరించేందుకు అర్జునుడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే వృత్తాసురుడు మహా శక్తిసంపన్నుడు.
ఎంతో తపస్సు చేసి తనను ఎటువంటి లోహంతో తయారు చేసిన ఆయుధంతో సంహరించినా మరణం లేకుండా వరం పొందాడు. ఈ విషయంపై దేవతలు శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకోగా, ఎంతో తపఃశక్తి కలిగిన భృగుమహర్షి కుమారుడైన దధీచి మహర్షి ప్రాణత్యాగం చేయడంతో ఆయన వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేశారు.
వాసవీ శక్తి లేదా శక్త్యాయుధం
ఇది ఇంద్రుని ఆయుధం. కర్ణుని కవచ కుండలాలను దానం అడిగిన ఇంద్రుడు, కర్ణుని దానగుణానికి ఆశ్చర్యపోయి కర్ణునికి ప్రతిఫలంగా తనవద్ద వద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇది లక్ష్య సాధన కలిగింది. మహాభారత యుద్ధం లో ఈ అస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించేందుకు కర్ణుడు ప్రత్యేకంగా దాచాడు. అయితే 14వ రోజు యుద్ధంలో ఘటోత్కచుడు తన మాయో పాయం తో యుద్ధం చేస్తుంటే అతన్ని సంహరించడానికి వాసవీశక్తిని ప్రయోగించమని దుర్యోధనుడు కోరడంతో కర్ణుడు శక్త్యాయుధాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించగా అతడు మహావృక్షం లా నేలకూలాడు.
గాండీవం
ఖాండవవనాన్ని అర్జునుడు అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వడంతో అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. స్వర్గ లోకంలో ఉన్న గాండీవ వృక్షం ద్వారా గాండీవం రూపొందించబడటంతో ఇది ఎంతో శక్తిమంతమైనది. బ్రహ్మదేవునివద్ద 1000 ఏళ్ళు, ప్రజాపతి వద్ద 503, చంద్రుని వద్ద 500, వరుణుడి వద్ద వందేళ్లు, ఇంద్రుని వద్ద 85 ఏళ్లూ ఈ గాండీవం ఉందని పురాణాల ప్రకారం తెలుస్తోంది. గాండీవానికి అక్షయ తూణీరం ఉంది. అంటే అంటే ఎన్ని బాణాలు వేస్తున్నా... అమ్ముల పొది ఖాళీ అవదు. ఇవే కాకుండా మరెన్నో శక్తిమంతమైన అస్త్రాలను మహాభారత యుద్ధంలో వినియోగించారు.
పాశుపతాస్త్రం
ఇది పరమేశ్వరుని దివ్య అస్త్రం. ఈ అస్త్రం కోసం అర్జునుడు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు ఆచరించాడు. ఇది ఎంతో విధ్వంసకరమైనది. దీనిప్రయోగం పరశురామ, అర్జున, కర్ణులకి మాత్రమే తెలుసు. అలనాటి రామాయణంలో రావణకుమారుడైన ఇంద్రజిత్కు తెలుసు. కానీ మహాభారత యుద్ధంలో గురుశాపం వల్ల కర్ణుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలేకపోతాడు.
– సి.ఎన్.మూర్తి
సీనియర్ జర్నలిస్ట్


