హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్ | Israel Blows Up Major Hezbollah Tunnel Packed With Weapons In Southern Lebanon, Check More Details Inside | Sakshi
Sakshi News home page

హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్

Jun 29 2026 8:19 AM | Updated on Jun 29 2026 10:31 AM

Israel blows up major Hezbollah tunnel packed with weapons

బీరూట్/జెరూసలెం: అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి అప్పుడే తొలి ముప్పు ఏర్పడింది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ సొరంగ నెట్‌వర్క్‌ను తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్ చర్యలపై హిజ్బుల్లా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, తమ మాతృభూమిని, ప్రజలను రక్షించుకోవడానికి ‘తిప్పికొట్టే హక్కు’ తమకు ఉందని హెచ్చరించింది.

శాంతి స్థాపనతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సాయుధ విభాగాన్ని నిరాయుధీకరించే లక్ష్యంతో, ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధులు కీలక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన కేవలం రెండు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఈ శాంతి ఒప్పందం భవిష్యత్తుపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, సైన్యం హిజ్బుల్లాకు చెందిన ఒక విస్తృతమైన భూగర్భ సొరంగాన్ని కనుగొని, దానిని పేల్చివేసినట్లు  వెల్లడించారు. ‘ఈ సొరంగం 200 మీటర్లకు పైగా పొడవు, 25 మీటర్లకు పైగా లోతును కలిగి ఉంది. దీనిలో ఇజ్రాయెల్ దేశాన్ని, ఇక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి సిద్ధంగా ఉంచిన వందలాది ఆయుధాలు, పలు లాంచ్ షాఫ్ట్‌లు (క్షిపణి ప్రయోగ కేంద్రాలు) ఉన్నాయి’ అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సైనిక చర్యకు పాల్పడటానికి ముందే వాషింగ్టన్‌తో పాటు లెబనాన్‌లోని అమెరికా ప్రతినిధికి కూడా ముందస్తు సమాచారం అందించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. తీరప్రాంత నగరమైన టైర్ సమీపంలోని మజ్దల్ జౌన్ గ్రామం వద్ద ఈ పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ప్రతినిధి ధృవీకరించారు. స్థానిక మీడియా హెచ్చరికలతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ఆపరేషన్ సందర్భంగా దక్షిణ లెబనాన్‌లో జరిగిన ఘర్షణల్లో తమ సైనికుడు ఒకరు మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అలాగే తమ దళాలతో పోరాటానికి దిగిన ఒక హిజ్బుల్లా కమాండోను కూడా మట్టుబెట్టినట్లు సైన్యం పేర్కొంది.

ఇది కూడా చదవండి: కేతన్ హత్య కేసు: ఏఐ సాయంతో వికృత రీల్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement